గుడి కంటే దేశ రక్షణే ముఖ్యం
రామమందర్ ట్రస్టు నిర్ణయం
అయోధ్య: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభించాలన్న ప్రయత్నాలను రామ మందిర్ ట్రస్టు నిలిపివేసింది. భారత్-చైనా సరిహద్దులో పరిస్థితి చాలా గంభీరంగా ఉందని, దేశాన్ని కాపాదుకోవడమే ఇప్పుడు చాలా ముఖ్యమని శుక్రవారం ఒక ప్రకటనలో ట్రస్టు తెలపింది. భారత సైనికులను చైనా సైనికులు హతమార్చడం పట్ల ట్రస్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రామాలయ నిర్మాణం ప్రారంభ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని ట్రస్టు తెలిపింది. దేశంలో పరిస్థితి మేరకు ఆలయ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని, దానిపై అధికారిక ప్రకటన చేస్తామని ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. వీర మరణం పొందిన భారత సైనికులకు ట్రస్టు నివాళులర్పించింది.
ఇదిలా ఉండగా.. చైనాకు వ్యతిరేకంగా వివిధ హిందూ సంస్థలు శుక్రవారం అయోధ్యలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. హిందూ మహాసభ కార్యకర్తలు చైనా పతాకాన్ని దగ్ధం చేయగా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. చైనా తయారీ వస్తువులను కూడా వారు ధ్వంసం చేశారు.