న్యూఢిల్లీ: ఆటోమేటెడ్ ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్(ఎఎఫ్ఆర్ఎస్)ను ఢిల్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో గత డిసెంబర్లో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ సాఫ్ట్వేర్ను తొలిసారిగా ఉపయోగించారని తెలుస్తోంది. ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించే నిరసనకారులను గుర్తించేందుకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. తరచూ నిరసనల్లో పాల్గొనే వారిని, రౌడీలను తమ వద్ద ఉన్న డేటా ద్వారా గుర్తించేందుకు దీనిని పోలీసులు ఉపయోగిస్తున్నారని సమాచారం. కాగా ఈ ఎఎఫ్ఆర్ఎస్ సాఫ్ట్వేర్ను స్టేషన్ల వద్ద నేరస్థులను గుర్తించేందుకు రైల్వేస్ ఉపయోగించాలనుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను గుర్తించేందుకు కూడా ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా పరిశీలించింది.
అయితే ఈ సాఫ్ట్వేర్ సమాజం మీద భయానక ప్రభావాన్ని కూడా చూపగలదని తెలుస్తోంది.దీనికి భయపడి ప్రజలు చాలా వరకు కొన్ని పనులను మానుకుంటారు. భావస్వేచ్ఛను ఉపయోగించుకోడానికి భయపడతారు. నిరసనలు నిర్వహించడానికి కూడా భయపడతారు. ఏది ఏమైనప్పటికీ ఎఎఫ్ఆర్ఎస్, ఇతర ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ నిఘా సిస్టమ్స్ ద్వారా అనుమానితుల డేటా చూడడానికి బదులు డేటాను విశ్లేషించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటివల్ల పౌరులు కొన్ని హక్కులు, స్వేచ్ఛను తగ్గించుకునే ప్రమాదం ఉంది.