హైదరాబాద్: కరోనాపై తప్పుడు వార్తలతో పుకార్లు రేపుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. బుధవారం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు.
తెలంగాణ ప్రజలు ఎవరూ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపాడు. అనుమానం ఉన్న ప్రతి శాంపిల్ను పూణేకు పంపించి రీ చెక్ చేయిస్తామన్నారు. కరోనాపై తప్పుడు ప్రచారాలపై ఐటి కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఇప్పటి వరకు వేరే ప్రాంతాల్లోనూ ఎవరినీ ఖాళీ చేయించడం లాంటిది జరగలేదని, అలాంటి వార్తలను అసలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఇప్పుడు తీసుకుంటన్న చర్యలన్నీ ముందు జాగ్రత చర్యలని పేర్కొన్నారు. తమ సిబ్బంది అందరికీ మాస్క్లు అందిస్తున్నామని ఐటి కంపెనీలు చెప్పాయని, దగ్గులు, తుమ్మలు వస్తున్న వాళ్లు మాత్రమే మాస్కులు వేసుకోవాలని సూచించారు. మిగతా వారు వేసుకోవాల్సిన అవసరం లేదని, వేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. ప్రైవేటు వ్యక్తుల పేర్లు, ఫొటోలు ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు.