ఢిల్లీ: కరోనాపై పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. కరోనా విజృంభించిన తరుణంలో ఈ సమావేశం విశిష్టమైందన్నారు. కరోనా వైరస్ ను భారత దేశం ధైర్యంగా ఎదుర్కొందని కొనియాడారు. తుపాన్ల నుంచి బర్డ్ ఫ్లూ వరకు ఎన్నో సవాళ్లను అధిగమించామని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచారన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలను ఖండించారు. రిపబ్లిక్ డే నాడు త్రివర్ణ పతాకాన్ని అవమానించారని, ఎర్రకోట ముట్టడి ఘటన దురదృష్టకరమన్నారు. కరోనా క్లిష్ట సమయంలో సమావేశాలు ప్రారంభమయ్యాయని, ఈ సమావేశాలు చాలా కీలకమైనవన్నారు. అనేక సవాళ్లను ఎదొర్కొని భారత్ ప్రగతిని సాధిస్తోందని కొనియాడారు. కరోనా కాలంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోల్పోయామని, ఉభయ సభలు ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించాయి.
వన్ నేషన్, వన్ రేషన్ కార్డును అమలు చేశామని, కరోనా సమయంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నామని, లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకున్నామని, దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు తయారు చేశామని, అనేక దేశాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తున్నామని రాష్ట్రపతి తెలియజేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ భారత్ లో కొనసాగుతోందని, ఎంత పెద్ద సవాళ్లయినా భారత్ ముందు తలవంచాల్సిందేనన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, వ్యవసాయ చట్టాలు చారిత్రాత్మకమైనవని, ఈ చట్టాలతో రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయని, దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరుగుతోందన్నారు. ఫసల్ బీమా ద్వారా సన్నకారు రైతులకు లాభం చేకూరుతుందని, రైతుల ఆదాయం పెంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు ఉన్నాయన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు రూ. లక్షా 13 వేల కోట్లు బదిలీ చేశామన్నారు. వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. రైతుల కోసం కిసాన్ రైలు తీసుకొచ్చామని, మత్స్యకారుల అభివృద్ధి కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకొచ్చామని, వ్యవసాయ చట్టాల మౌళిక వసతుల కోసం రూ. లక్ష కోట్లు కేటాయించామన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నిర్ణయాలు ఉంటాయని వివరించారు.