అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రైతుల పోరు 38వ రోజుకు చేరుకుంది. రాజధానిలో ఉధృతంగా రైతుల ఉద్యమం ముందుకు సాగుతోంది. మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక మంగళగిరిలో మహిళా జేఎసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోడీ శంకుస్థపాన చేసిన ఉద్దండరాయిని పాలెంలో పలు గ్రామాలకు చెందిన రైతులు నిరసనలు చేపట్టగా… మహిళలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అటు వెలగపూడి, కృష్ణాయపాలెం, తూళ్లూరు రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయితే మండలిలో మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్ లు పడడంతో రాజధాని రైతులకు కాస్త ఊరట లభించింది. అయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని రైతులు తేల్చి చెప్పారు. మండలి చైర్మెన్ షరీఫ్ ఫ్లెక్సీలకు ప్రజలు పాలాభిషేకాలు చేస్తున్నారు. నేటి నుంచి లాయర్లు పోరు ఉధృతం చేయనున్నామని ప్రకటించారు. ఎపిలోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో రైతులు, మహిళలు ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.