యూసుస్గూడలో మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
20వేల లీటర్లు వినియోగించే వారికి ఉచితంగా నీరు
డిసెంబర్ నెల నుంచి లబ్దిదారులకు జీరో బిల్లు
దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇస్తామంటున్న అధికారులు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ఇచ్చిన ఉచిత మంచినీటి సరఫరా హామీని అమలు చేసేందుకు ఈనెల 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుప్గూడలో మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తున్నారు. నీటి సరఫరాకు సంబంధించిన కార్యక్రమాలు వేగం చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. 20వేల లీటర్లు లోపు నీరు ఉచితంగా సరఫరా చేస్తామని, డిసెంబర్ నెల నుంచి వారికి నెల వారీ బిల్లులు ఉండవని, గ్రేటర్ పరిధిలో ఉన్న నీటి కనెక్షన్లలో 90శాతం కనెక్షన్లు ఉచిత నీటి పథకం పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో నగర ప్రజలు టిఆర్ఎస్ సర్కార్కు మెజార్టీ సీట్లు కట్టబెట్టడంతో వాగ్దానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో సరఫరా చేసేందుకు అక్కడి అధికారులు నుంచి సలహాలు తీసుకుని, ఏవిధంగా ముందుకు వెళ్లాల్లో వివరాలు తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే బోర్డు ప్రతి నెల రూ. 40కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నగర ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా సకాలంలో సరఫరా చేస్తున్నారు. బోర్డులకు నెలకు రూ. 160 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 120 కోట్లు వసూలైతున్నాయి. వీటితోనే ఉద్యోగుల జీతభత్యాలు,నిర్వహణతో పాటు ఇతర్రతా ఖర్చులకు వినియోగిస్తున్నారు. నగరంలో 10.46 లక్షల నల్ల కనెక్షనులుండగా, వాటి ద్వారా రోజు 460ఎంజిడిల నీరు సరఫరా చేస్తున్నారు. అయిస సరే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్లుతుందని డివిజన్ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు పాతబకాయిలు కూడా పెద్ద ఎత్తున పేరుకపోతున్నాయి. వాటిని ఫిబ్రవరి వరకు వసూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటిఎస్ పథకం ద్వారా సామాన్యులు, మధ్యతరగతి ప్రజలే బకాయిలు చెల్లించడంతో రూ. 220 కోట్లు వరకు ఆదాయం వచ్చినట్లు బోర్డు పేర్కొంది.
గత రెండేళ్ల నుంచి కనెక్షన్ కోసం చేసిన దరఖాస్తులు పరిశీలించి అనుమతి ఇస్తే మరో రూ. 2కోట్లవరకు ఆదాయ రావచ్చంటున్నారు.అదే విధంగా అక్రమంగా ఉన్న కనెక్షన్లు తొలగిస్తే నీటి వృథాకు చెక్పెట్టవచ్చని భావిస్తున్నారు. ఈఏడాది కురిసిన భారీ వర్షాలకు నగరంలోని జంటజలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో రెండేళ్ల వరకు నీటి సరఫరా సకాలంలో చేయవచ్చని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి నుంచి తరలించే నీటి సరఫరాలో కొంత ఆదా అవుతుందని వివరిస్తున్నారు.ఈనెల 11 నుంచి ఉచిత నీరు పథకం ప్రారంబించడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.