మన తెలంగాణ/హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ పెరుగుతోంది. తదనుగుణంగా ఛార్జింగ్ కేంద్రాలకు గిరాకీ ఏర్పడుతోంది. భాగ్యనగరంలో ఉన్న 40 ప్రాంతాల్లో ఏర్పాటైన ఛార్జింగ్ కేంద్రాలకు తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 138 కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. ఇందుకుగానూ రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించే మూడు ప్రధాన జాతీయ రహదారుల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అందుబాటులోకి తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ యత్నిస్తోంది. ఏడాదికి 200 చొప్పున రానున్న మూడేళ్ల వ్యవధిలో 600 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం గైకొంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇవి ఏర్పాటు కానున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల జాబితాలోని పుణే, బెంగళూరు, విజయవాడల మధ్య ప్రజల రాకపోకలు గణనీయంగా ఉన్నాయి. ఆ దృష్టా 1087.45కిమీ పరిధిలో ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాహనదారులకు ఉపయుక్తంగా ఉంటుందని, ఛత్తీస్గఢ్ సరిహద్దువరంగల్, నాగ్పూర్హైదరాబాద్బెంగళూరు, జనగామహైదరాబాద్, సూర్యాపేటవిజయవాడ, పుణెహైదరాబాద్ మార్గాల్లో ఛార్జింగ్ కేంద్రాలకు డిమాండ్ ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చిన వరంగల్, కరీంనగర్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ గుర్తించింది. ఇందుకు అనువైన ప్రణాళిక త్వరలో రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 5451 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. టిఎస్ఆర్టీసిలో 48 వరకు ఎలక్ట్రిక్ బస్సులు శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. వాయు కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తక్షణావసరం. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆసక్తి ప్రారంభమైంది. రానున్న కాలంలో ఇది మరింత ద్విగుణీకృతం కానుందని రవాణా రంగ నిపుణుల అంచనాగా ఉంది. దీంతో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అంతే స్థాయిలో గిరాకి పెరుగుతోందని చెబుతున్నారు.
రానున్న కాలంలో ఏ ఏటికాఏడు ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనాలున్నాయి. మరోవైపు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. తాజాగా హైదరాబాద్లో ఒహెచ్ఎం, ఒఎస్ఎం సంస్థలు కొత్తగా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్గో ఆటోను మార్కెట్లో విడుదల చేశారు. ప్రభుత్వం ఈపాలసీ ప్రకటించిన మరునాడే ఎలక్ట్రిక్ ఆటో మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని బట్టే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజాసక్తి ఎంతగా ఉందో స్పష్టమవుతోంది. ఇప్పటికే వాహనాల తయారీదారుల నుంచి కొనుగోలుదారుల వరకు అందరికీ ప్రభుత్వం ప్రోత్సాహాకాలను ప్రకటించింది.