Sunday, April 28, 2024

జాతీయ రహదారులపై విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు

- Advertisement -
- Advertisement -

ప్రతి 25 కిలో మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు
కసరత్తు చేస్తున్న రెడ్కో అధికారులు

మన తెలంగాణ/ హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గుతున్న వాటి ప్రయోజనాలు వాహనదారులకు అందేలా కనిపించడం లేదు. దాంతో వారంతా పర్యావరణ అనుకూలమైన విద్యుత్ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా విద్యుత్ వాహనాలకు రోడ్డు మీదకు వస్తున్నాయి. వాటికి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుప చేయాల్సిన బాధ్యత రెడ్కో అధికారులపై పడింది.

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 40 చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా మరో 180 చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్లలో విద్యుత్ చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు టిఎస్ రెడ్కో ఆధ్వర్యంలో స్థలాలను అన్వేషిస్తున్నారు. చార్జింగ్ స్టేషన్ల కోసం కేవలం సంస్థకు చెందిన స్థలాల్లోనే కాకుండా ప్రైవేట్ కమర్షియల్ కాంప్లెక్స్‌లలో, షాపింగ్ మాల్స్‌లో అపార్ట్‌మెంట్‌లలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.అంతే కాకుండా వాహనాల వినియోగాన్ని బట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామంటున్నారు.

విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను కేవలం నగరానికి పరిమితం చేయకుండా జిల్లాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.ఇందులో భాగంగా జిల్లాకు 10 చొప్పును వీటిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.ముఖ్యంగా జాతీయ రహదారుల్లో ప్రతి 25 కిలో మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం ద్వారా ఇటు జాతీయ రహదారి మీదుగా వెళ్ళె వాహనదారులకే కాకుండా అటు జిల్లాల్లో ఉండే వారికి కూడా ఎంతోప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి స్థలాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. గతంలో తాము చార్జింగ్ స్టేషన్లకు సంబంధించి ఇవోసితో ఒప్పందం చేసుకున్నామని అయితే అది అనివార్య కారణలతో సాధ్యపడలేదని చెబుతున్నారు.ప్రస్తుతం జాతీయ రహదారులపై వెంటనే చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

పర్యావరహణ హితమైన విద్యుత్ వాహనాలు మరింత ప్రోత్సహించాలని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.ముఖ్యంగా ప్రభుత్వంలోని పలు విభాగాల్లో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టం ద్వారా వీటి వినియోగాన్ని పెంచవచ్చు. అంతే కాకుండా వీరికి సులభవాయిదా పద్దతుల్లో వీటిని అందచేయడం, విద్యుత్ వాహనాల పట్ల మరింత అవగాహన పెంచడం ద్వారా వీటి సంఖ్యను మరింత పెంచవచ్చని చెబుతున్నారు. విద్యుత్ వాహనాల వినియోగం పట్ల వాహనదారులకు అవగాహన కూడా కల్పించడమే కాకుండా ఎగ్జిబిషన్లను కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్,డీజిల్, సీఎన్జీ వంటి ఇంధనాలు ధరలు కారణంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ వాహనాల కోనుగోలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2 వేల ద్విచక్రవాహనాలు, 500 గూడ్స్ వాహనాలు, 1000 ఆటోలు, 50 బస్సులకు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తారని ప్రకటించింది. అయితే అప్పుడు వాటిపై అంతగా దృష్టి సారించని వాహనదారులు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వాహనాలవాడకమే మేలని భావించడంతో విద్యుత్ వాహనాల సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News