Saturday, April 27, 2024

తెలంగాణపై ఎందుకీ వివక్ష?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరపాలని టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలో బిఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నామా మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలతో పాటు రైతు, నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. రైల్వే, హైవేలతో పాటు పలు అంశాల గురించి కూలంకుషంగా చర్చించాలని పేర్కొన్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు చేసిన సిఫారసులు, 13,14,15వ ఆర్థిక సంఘాలు సూచించిన నిధుల విడుదల చేయకపోవడం, రుణం పొందే విషయంలోనూ ఆంక్షల గురించి ఈ సభలో కచ్చితంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసినట్లు తెలిసింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ సంస్కరణలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, నిరుద్యోగం, కులగణన, రిజర్వేషన్‌లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చ జరగాలని ఆయన ఈ సమావేశానికి సూచించినట్టుగా తెలిసింది. కేంద్రం వేస్తున్న కొర్రీలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుండడం, కేంద్రం అడ్డుపడడం వల్ల రాష్ట్రానికి రూ.40 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లడం వంటి అంశాలతోపాటు రాష్ట్రానికి జరుగుతున్న, జరిగిన అన్యాయాలపై కచ్చితంగా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News