Monday, May 6, 2024

దేశానికి దిశ మీరే

- Advertisement -
- Advertisement -

H D Kumara Swamy about KCR after Meeting

మన తెలంగాణ/హైదరాబాద్: వర్తమాన జాతీయ రాజకీయాలు, దేశ పాలనలో శూన్యత నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సేవలు చాలా అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకలవర్గాలను కలుపుకుని ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఎంతో అవసరమన్నారు. అటువంటి కెసిఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమన్నారు.
అరవయేండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ దేశం గర్వించే రీతిలో రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడుపుతున్న కెసిఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని ఈ సందర్భంగా కుమారస్వామి అభిలాషించారు. అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని వెల్లడించారు. సిఎం కెసిఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు.
హైదరాబాద్‌కు వచ్చిన కుమారస్వామి ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌కు వచ్చిన కుమారస్వామికి కెసిఆర్ స్వయంగా ఎదురెళ్లి, సాదరంగా స్వాగతం పలికారు. తన వెంట తోడ్కొని లోనికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంఎల్‌సిలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శాసనసభ్యులు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అర్ధవంతమైన చర్చలు
ఈ భేటీ సందర్భంగా సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలతో సుదీర్ఘంగా కుమారస్వామి చర్చించారు. తమ నడుమ అర్థవంతమైన చర్చ సాగిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కెసిఆర్ అలుపెరగకుండా సాగించిన ఉద్యమం, శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అదే పద్దతిలో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న తీరుపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది.

దేశానికి తెలంగాణ మోడల్ అవసరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చూసి దేశమంతా చర్చిస్తున్నదని కుమారస్వామి పేర్కన్నారు. ఇలాంటి అభివృద్ధి కావాలని అన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయని కుమారస్వామి ఈ సందర్భంగా కెసిఆర్‌కు అభినందనలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు పంపిణి జరుగుతోందన్నారు. అలాగే ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, తదితర పథకాల పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను సిఎం కెసిఆర్‌తో కుమారస్వామి పంచుకున్నారు. తెలంగాణ వంటి పాలన, పథకాలు, కర్నాటక రాష్ట్రంతో సహా పక్క రాష్ట్రాల ప్రజలు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఇదే విషయమై తమ దృష్టికి వచ్చిన అంశాలను కెసిఆర్‌తో కుమారస్వామి చర్చించారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అనతి కాలంలోనే ప్రశంసలు అందుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన కుమారస్వామి దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిజెపి ముక్త్ భారత్ కోసం సమిష్టి కృషి
దేశంలో విచ్ఛిన్నకర పాలన ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల నడుమ విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని సిఎం కెసిఆర్ వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ రాజకీయ పంథాను, దాని పర్యవసానాలను చర్చించిన ఇరువురు నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకుంటామని వారిరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దిశగా దేశ ప్రజాస్వామిక సమాఖ్య స్పూర్తిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరమున్నదని వారు గుర్తించారు. దేశవ్యాప్తంగా బిజెపి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కర్నాటక ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ తో అన్నారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ గుణాత్మక ప్రగతికోసం తన వంతు సహకారాన్ని అందించాలని, అందుకోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమార స్వామి తెలిపారు.

విఫలమైన కాంగ్రెస్
కాగా బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందనని, ఆ పార్టీ నాయకత్వంపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయ తక్షణావసరమని వారు చర్చించారు.

తెలంగాణ వ్యాప్తంగా ఒత్తిడి
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతున్న విషయాలను సిఎం కెసిఆర్, కర్ణాటక మాజీ సిఎంకు వివరించారు. మతతత్వ బిజెపిపై, మోడీ ప్రజావ్యతిరేక, నిరంకుశ వైఖరిపై పోరాడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజలు తమ హర్షధ్వానాలతో, నినాదాలతో జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా తనకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బిజెపిపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారని అన్నారు. చివరకు తమ సొంత టిఆర్‌ఎస్ పార్టీ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శివర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, కమలం ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని కుమారస్వామికి ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వివరించారు.

దేశంలో రైతు రాజ్యం రావాలె
వ్యవసాయాధారిత భారతదేశంలో తెలంగాణలో మాదిరిగానే రైతులకు ఇస్తున్న నిరంతర విద్యుత్ తదితర ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ, సహా వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని కెసిఆర్
వివరించారు. ఈ దిశగా 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రపాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తూ, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతోందని వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ దమననీతిని వారు ఖండించారు. వ్యవసాయ రంగాన్నే కాకుండా ఆర్థిక, సామాజిక తదితర అన్నిరంగాలను అధోగతిపాలు చేస్తూ రోజురోజుకూ ఆ పార్టీ దిగజారిపోతున్న వైనాన్ని వారు చర్చించారు.

దేశవ్యాప్తంగా రైతుల ఆహ్వానం
తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న దేశవ్యాప్తంగా ఉన్న పలు రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీరు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల గురించి వారు తెలుసుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని, తమకూ తెలంగాణ మాదిరిగానే 24 గంటలు ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందేలా చర్యలు చేపట్టాలని, అందుకు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి రైతు రాజ్య స్థాపనకు కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తూ, తనతో మూడు రోజులపాటు జరిగిన చర్చల విషయాన్ని కుమారస్వామికి కెసిఆర్ వివరించారు.

జాతీయ పార్టీ ఎజెండాపై చర్చ
త్వరలో తాను స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా కుమార స్వామితో కెసిఆర్ చర్చించారు. దేశ చరిత్రనే వక్రీకరిస్తూ కొనసాగుతున్న బిజెపి విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను తుత్తునియలు చేయని పక్షంలో దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని వారు తమ చర్చలో గుర్తించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సకల వర్గాలను కలుపుకపోతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మౌలిక సమస్యలను గాలికొదిలి, భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే మోడీ పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించారు. అందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలచుకోవాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.

కేసీఆర్ కేంద్రంగా దేశ రాజకీయాల్లో చర్చ
దేశ రాజకీయాల్లో 75 సంవత్సరాలపాటుగా సాగుతున్న మూస రాజకీయాలకు దేశ ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని, వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదనే క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ గురించి వారిద్దరూ చర్చించారు. అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ రాజకీయంగా మాట్లాడుకునే అసలు సిసలు రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. జాతీయ సమస్యలపై స్పందిస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలతోపాటు, తాను చేపట్టిన పలు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలు పలికిన ఆహ్వానాల తీరుతెన్నులపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, దాదాపు మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలోని చర్చలు అర్థవంతంగా ముగిసాయి. అనంతరం ప్రగతి భవన్ నుంచి తిరిగి బయలుదేరిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రికి మర్యాదపూర్వకంగా సిఎం కెసిఆర్ వీడ్కోలు పలికారు.

H D Kumara Swamy about KCR after Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News