28లోగా బకాయి జీతాలు, పెన్షన్లపై నిర్ణయం హైకోర్టుకు
తెలియజేసిన అడ్వకేట్ జనరల్ విచారణ అక్టోబర్ 1కి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లల్లో విధించిన కోతలను తిరిగి చెల్లింపులపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. బకాయిలపై 12 శాతం వడ్డీతో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం.. ప్రభుత్వం ముందు బకాయిలు చెల్లించనీయండి అని వ్యాఖ్యానించింది. జీతాలు, పెన్షన్లో కోతలు విధింపులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్స్ను మంగళవారం హైకోర్టు విచారించింది. తగ్గించిన వేతనాలు, పింఛన్ల చెల్లింపులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోనుందని అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈనెల 28లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పెన్షనర్లకు బకాయిల మొత్తం ఒకేసారి చెల్లించాలని, వాయిదాల పద్ధతిలో చెల్లిస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వెంటనే చెల్లింపుల నిర్ణయాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
HC hearing salaries and pensions of govt employees