లోతట్టు ప్రాంతాలు జలమయం
రోడ్లపై గంటల తరబడి వాహనదారుల నరకయాతన
రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు… మ్యాన్హోళ్ల వరదనీరు తొలగింపు
హైదరాబాద్: నగరంలోని కురిసిన బారీ వర్షానికి పలు ప్రాంతాలు చెరువులుగా తలపించాయి. వరద నీరు ఉప్పొంగడంతో రహదారులపై ట్రాపిక్ జాం ఏర్పడంతో సాయంత్రం రెండు గంటల పాటు వాహనదారులు నరకయాతన అనుభవించారు. జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు వచ్చి మ్యాన్హోళ్ల ద్వారా లోతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీరు తొలగించారు. దీంతో నగర ప్రజలు వరద ముంపు నుంచి ఉపశమనం పొందారు. బుధవారం శేరిలింగంపల్లి, షేక్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, సోమాజిగూడ, చార్మినార్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురువగా, ఉప్పల్, విద్యానగర్, అంబర్పేట, నల్లకుంట, రామంతాపూర్, తార్నాక, లాలాపేట, మల్కాజిగిరి సమీపంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఈసందర్బంగా ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేస్తూ నెమ్మదిగా వెళ్లాలని, వాహనాల హెడ్లైట్లు ఆన్చేసుకుని డ్రైవ్ చేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ 19 అత్యవసర బృందాలు రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో మెహరించి వరద నీటి సమస్య లేకుండా చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షపాతం అధికంగా అసిఫ్నగర్ 31.3 మి.మి, షేక్పేట మండలంలో 30.8 మి.మి. శేరిలింగంపల్లి 15.3 మి.మి, అమీర్పేట 5.7మి.మి. హిమయాత్నగర్ 0.4మి.మి. నాంపల్లి 21.9మి.మి. ఖైరతాబాద్ 11.3మి.మి, గొల్కొండ 10.1మి.మి, బహదూర్పురా 5.5మి.మి, బండ్లగూడ 1.6 మి.మి, చార్మినార్ 21.2 మి.మి, సైదాబాద్ మండలంలో 6 మి.మి, సరూర్నగర్ 1.1 మి.మి, రాజేంద్రనగర్ 1.0 మి.మి, బాలానగర్ 0.3 మి.మి కురుసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో సగటున 5.8 మి.మి వర్షపాతం నమోదు చేసుకుంది.