తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని సోమవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. తిరుమల స్వామివారిని 25,295 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారికి 13,949 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.2.51 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేసినట్టు టిటిడి అధికారులు వెల్లడించారు. తిరుపతి శ్రీనివాసంలో సర్వదర్శన టోకెన్లు ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు రోజుకు 2 వేలు టికెట్లను మాత్రమే ఇస్తుంది. ఇదిలా ఉండగా టీటీడీ తయారు చేయించిన అగరబత్తులు సోమవారం నుంచి తిరుమల లో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచారు. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద మూడు కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకాల విక్రయశాల వద్ద, ఒక కౌంటర్ లో అగరబత్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
Huge devotees visits Tirumala Temple