సలెం(అమెరికా): నిప్పుల కొలిమిలా మారిన కెనడా, అమెరికా, ఒరెగాన్లో ఎండవేడిమిని తట్టుకోలేక వందలాది మంది మరణించారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు వందల సంఖ్యలో ప్రజలను బలిగొంటున్నాయి. బుధవారం ఒక్కరోజే ఎండలను తట్టుకోలేక 60 మందికి పైగా మరణించినట్లు ఒరెగాన్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఒరెగాన్ రాష్ట్రంలోని అతిపెద్ద కౌంటీ మల్ట్నోమాలో ఇప్పటివరకు 45 మందికి పైగా మరణించారు. గత శుక్రవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎండల కారణంగా 486 హఠాన్మరణాలు సంభవించినట్లు బ్రిటిష్ కొలంబియా చీఫ్ కరొనర్ లిసా లపాయింటె తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నట్లు ఆమె తెలిపారు.
సీటెల్తోపాటు వాంకోవర్, బ్రిటిష్ కొలంబియాలో అనేక మంది ఎయిర్ కండీషనింగ్ లేని ఇళ్లలో నివసిస్తున్నారు. ఇంత వేడిమిని గతంలో ఎన్నడూ అనుభవించలేదని, దీంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని వాంకోవర్ పోలీసు సార్జంట్ స్టీవ్ ఆడిసన్ చెప్పారు. వాషింగ్టన్లో కూడా ఎండల కారణంగా 20కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. సీటెల్, పోర్ట్ల్యాండ్, తదితర అనేక నగరాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కెనడాలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ఇప్పటికే ప్రజల జీవితాలు అతలాకుతలం కాగా ఇప్పటివరకు 240 మంది ఎండ వేడిమికి, వడగాడ్పులను తట్టుకోలేక మరణించారు.