సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: అత్తారింట్లో కుటుంబ సభ్యులు, బంధువులు కొట్టడం వల్ల భార్య గాయపడినా దానికి ప్రధాన బాధ్యత భర్తదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.తన భార్యకు తగిలిన గాయాలకు కారణం తాను కాని, తన తండ్రి వల్లే అలా జరిగిందని, తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను తోసిపుచ్చింది. అత్తారింట్లో తన బంధువులవల్ల్ల భార్యకు గాయాలైనా దానికిప్రధాన బాధ్యత మాత్రం భర్తదేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అతని ముందస్దు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది.
గత ఏడాది జూన్లో లూధియానాకు చెందిన ఓ మహిళ తనను భర్తతో సహా అత్తింటి వారు హింసిస్తున్నారని, తీవ్రంగా కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై తనను అరెస్టు చేయకుండా కాపాడాలంటూ ఆమె భర్త పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డే నృతృత్వంలోని ధర్మాసనం భర్తపై తీవ్రంగా మండిపడింది.‘నువ్వేం మనిషివి. తనను చంపడానికి ప్రయత్నించాడని నీ బార్య చెబుతోంది. మీరు కొట్టడం వల్ల తనకు గర్భస్రావం అయిందని చెప్పింది. భార్యను క్రికెట్ బ్యాట్తో కొడతావా? నువ్వేం మనిషివి?’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.