కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు ఫ్యాక్టరీలను కొనడానికి ఎవరూ ముందుకు రాకుంటే వాటిని తప్పనిసరిగా మూసివేస్తామని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఐదేళ్లలో ఐదు ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) అనుమతి ఇచ్చిందని ఆయన వివరించారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటజిక్ పరిధి లోకి వస్తుందని ఈ విభాగం లోకి వచ్చే ప్రభుత్వ రంగ వాణిజ్య పరిశ్రమలను సాధ్యమైనంతవరకు పైవేటీకరిస్తామని లేనిపక్షంలో వాటిని మూసివేస్తామని స్పష్టం చేశారు.
ఆత్మ నిర్భర్ భారత్ కోసం 2021 పిబ్రవరి 4న ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని, ఆమేరకు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు, బీమా సంస్థలకు ఇది వర్తిస్తుందన్నారు. ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ రంగం లోని పరిణామాలు, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిదారుల ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో బిజెపి ఎంపి సస్మిత్ పాత్ర అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా వివరాలు తెలియచేశారు.