Monday, April 29, 2024

లాక్‌డౌన్ అమలు భేష్

- Advertisement -
- Advertisement -

Hyderabad is lock down

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రశంసించింది. లాక్‌డౌన్, కరోనా నిబంధనల అమలుపై డిజిపి నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 98 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద 57 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిజిపి తెలిపారు. లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీ అమలుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ఈ నెల 1 నుంచి 14 వరకు 4,31,823 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మాస్కులు లేనివారిపై 3,39,412 కేసులు నమోదు చేశామని, అలాగే రూ.31 కోట్ల జరిమానా విధించినట్లు వివరించారు. భౌతిక దూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనపై 26,082 కేసులు నమోదైనట్లు తెలిపారు. మూడు కమిషనరేట్ల పోలీసుల, సిపిల పనితీరు అభినందనీయమని హైకోర్టు కొనియాడింది. పోలీసులందరూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది.

హైకోర్టులో సుదీర్ఘ విచారణ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోర్టు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల లాగా తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా మొదటి దశలో ప్రైవేటు ఆస్పత్రుల ఛార్జీలపై ముగ్గురు ఐఎఎస్‌లతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కానీ రెండో దశలో కరోనా తీవ్రంగా ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల ఛార్జీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యం గా ప్రైవేటు ఆస్పత్రుల్లో సిటిస్కాన్, ఇతర పరీక్షలకు ధరలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జివొ ఇప్పుడు సరిపోదని కోర్టు అభిప్రాయపడింది. కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా కరోనా పరిస్థితులు, కట్టడి విషయంలో తీసుకున్న చర్యలను రాష్ట్ర డిజిపి, డిహెచ్, నగరంలోని మూడు కమిషనరేట్‌ల సిపిలు నివేదికలు సమర్పించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను హైకోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.

రోజుకు కనీసం లక్ష పరీక్షలు

కరోనా విజృంభిస్తున్న సమయంలో రోజూ కనీ సం లక్ష పరీక్షలు జరపాలని అనేక సార్లు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో ఒప్పంద, పొరుగు సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్న అంశంపై ఆరా తీసింది. ప్రాణాలకు తెగించి పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించింది. వెంటనే వేతనాలు విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

కరోనా పరిస్థితులపై డిహెచ్ నివేదిక

కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు(డిహెచ్) నివేదిక సమర్పించారు. ఈ నెల 1 నుంచి 14 వరకు సరాసరి 69,185 పరీక్షలు జరిపినట్లు తెలిపారు. దేశ సరాసరితో పోలిస్తే కరోనా పరీక్షల్లో వెనుకబడలేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు గరిష్ఠ ధరలు గతంలోనే ఖరారు చేశామని అన్నారు. ఔషధాల ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని కోర్టుకు డిహెచ్ విన్నవించారు. చికిత్స విధానాలు మారినందున సమీక్షించి తాజా జివొ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించింది.అలాగే కొవిడ్ బాధితులకు ఇస్తున్న కిట్‌లో స్టెరాయిడ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వివరాలు సమర్పించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రిసింగ్ అథారిటీని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News