Saturday, April 27, 2024

కమీషన్‌కు కక్కుర్తిపడితే జైలు పాలు కావాల్సిందే

- Advertisement -
- Advertisement -

బ్యాంక్ ఖాతా ఇచ్చినోళ్లు కటకటాల్లోకి
ముగ్గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః డబ్బులు వస్తున్నాయని బ్యాంక్ ఖాతా ఇచ్చి సైబర్ నేరస్థులకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కమీషన్ వస్తుందని ఆశపడి బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన పలువురిని పోలీసులు కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలా నలుగురు బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన వారిని అరెస్టు చేశారు. కేరళకు చెందిన ఇద్దరు యువకులు, తమిళనాడుకు చెందిన మహిళను అరెస్టు చేశారు. వీరి వద్ద బ్యాంక్ ఖాతాలు తీసుకున్న సైబర్ నేరస్థులు దేశ వ్యాప్తంగా భారీగా సైబర్ నేరాలు చేసి వాటికి డబ్బులు తరలించారు.

కేరళకు చెందిన ఇద్దరు యువకులు జానీ, మనువల్నును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలకు నిందితులు నగరానికి చెందిన బాధితురాలికి రూ.49.45లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ముంబాయికి చెందిన సోయబ్ బాబుల్ ఖాన్ బ్యాంక్ ఖాతాలు తీసి సైబర్ నేరస్థులకు ఇస్తున్నాడు. ఇలా పలు బ్యాంక్‌లకు చెందిన బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి సైబర్ నేరస్థులకు ఇచ్చాడు.

ఒక్కో బ్యాంక్ ఖాతాకు సైబర్ నేరస్థుల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఇలా నిందితుడు ఇచ్చిన బ్యాంక్ ఖాతాల ద్వారా సైబర్ నేరస్థులు దేశవ్యాప్తంగా 42 నేరాలు చేశారు, తెలంగాణ రాష్ట్రంలో ఆరు కేసులు నమోదయ్యాయి. వారు ఇస్తున్న డబ్బులకు ఆశపడి బ్యాంక్ ఖాతాలు ఇవ్వడంతో జైలు పాలయ్యాడు. సైబర్ నేరాలు చేస్తున్న నిందితులను పోలీసులు బ్యాంక్ ఖాతాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేయడంతో వారు రూట్ మార్చారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వారి చేతికి మట్టిఅంటకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురి బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి తమకు ఎటిఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇస్లే కమీషన్ ఇస్తామని ఎర వేస్తున్నారు.

ఎంతోకొంత డబ్బులు వస్తాయని ఆశపడి బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చిన వారు జైలు పాలవుతున్నారు. బ్యాంక్ ఖాతాదారులతోనే సైబర్ నేరస్థులు బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయించుకుని డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు బ్యాంక్ ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ చేసినందుకు బ్యాంక్ ఖాతాదారులకు 10 శాతం, 3శాతం కమీషన్ ఇస్తున్నారు, ఇలా చేసి సైబర్ నేరస్థులు తమ చేతికి మట్టిఅంటకుండా చూసుకుంటున్నారు. సోషల్ మీడియా, తదితర వాటిల్లో గుర్తుతెలియని వారితో ఛాటింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులు స్నేహం చేసినట్లు నటిస్తున్నారు. తర్వాత వారి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి దానిలో డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళ సైబర్ నేరస్థులు బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తే 10శాతం కమీషన్ ఇస్తామని చెప్పడంతో కొత్తగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి సైబర్ నేరస్థులకు ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన బాధితురాలు పార్ట్‌టైం జాబ్ పేరుతో మెసేజ్ రావడంతో దానికి స్పందించింది. కొద్ది రోజులకు నిందితులు తన ప్లాన్‌ను అమలు చేశారు. తాము చెప్పినట్లు పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితురాలు రూ.5లకు పైగా సైబర్ నేరస్థుల బ్యాంక్ ఖాతాకు పంపించింది. బాధితురాలి డబ్బులు వచ్చిన తర్వాత సైబర్ నేరస్థులు స్పందించడం మానివేశారు. బాధితురాలు మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తు చేసిన పోలీసులు బ్యాంక్ ఖతాను గుర్తించి తమిళనాడుకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే మహారాష్ట్రకు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రాంలో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొద్ది రోజులు స్నేహం చేశారు, తరచూగా ఛాటింగ్ చేసుకునేవారు. ఒక రోజు యువతి బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తే ఇంటి అద్దె రూ.3,000 ఇస్తానని చెప్పాడు. ఉచితంగానే డబ్బులు వస్తున్నాయని తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపించింది. నిందితుడు వాటిని సైనిక్‌పురికి చెందిన బాధితురాలికి ఇచ్చి ఆమెను యువతి బ్యాంక్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాడు.

తక్కువ డబ్బులకు ఎక్కువ లాభం వస్తుందని సదరు మహిళ లక్ష రూపాయలు డిపాజిట్ చేసింది. తర్వాత నుంచి నిందితుడు ఆమెకు అందుబాటులో లేకుండా పోయాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా గుర్తుతెలియని వ్యక్తికి బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వడంతో యువతి కటకటాలపాలైంది.

కమీషన్‌కు ఆశపడితే….
చాలామంది బ్యాంక్ ఖాతాలు ఇచ్చే వారు సైబర్ నేరస్థులు భారీగా కమీషన్ ఇస్తామని చెప్పడంతో బ్యాంక్ ఖాతాలు కొత్తగా ఓపెన్ చేసి ఇస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళ బ్యాంక్ ఖాతా ఇచ్చినందుకు డిపాజిట్ అయిన డబ్బుల్లో 10శాతం కమీషన్ ఇస్తామని ఆశ పెట్టారు. కేరళకు చెందిన ఇద్దరు యువకులు కష్టపడకుండానే డబ్బులు వస్తున్నాయని ఆశపడిన మహిళ బ్యాంక్ ఖాతాను సైబర్ నేరస్థులకు ఇవ్వడంతో కటకటాలపాలయ్యారు. ఇలా చాలామంది బ్యాంక్‌ఖాతాలను ఇవ్వడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. సైబర్ నేరాలు పెరగడంతో పోలీసులు బ్యాంక్ ఖాతాలు ఇస్తున్నవారిపై దృష్టి సారించారు. బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరస్థులకు అందకుండా చేస్తే కొంత వరకు కట్టడి చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News