న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం తుపాన్గా మారడం వల్ల వారం రోజుల్లో దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో మంచి వర్షాలకు అవకాశమున్నదని భారత వాతావరణశాఖ(ఐఎండి) అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వచ్చే వారం ఒడిషా దిశగా పయణించనున్నట్టు ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. పరిస్థితులు నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా మారుతున్నాయి. మరో రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్ర ప్రాంతం, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించనున్నట్టు ఆయన తెలిపారు.
జూన్ 1న కేరళలోకి రుతు పవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. జూన్లో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే 9 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు ఐఎండి తెలిపింది. తూర్పు ఉత్తర్ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురియనున్నట్టు ఐఎండి తెలిపింది. తుపాన్కు ముందు సముద్రంలో అల్పపీడనం ఏర్పడటం సూచిక. అయితే, ప్రతి సందర్భంలోనూ అల్పపీడనం తుపాన్గా మారుతుందని చెప్పలేం.