న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని డిజిటల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 21న ఉదయం 7 గంటలకు యోగాడేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అన్నది థీమ్గా నిర్ణయించారు. లెహ్ వద్ద పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఆయుష్ మంత్రిత్వశాఖ కరోనా విజృంభణతో దానిని విరమించుకున్నది. మై లైఫ్, మై యోగా పేరుతో వీడియో పోటీలను ప్రధాని మోడీ మే 31న ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు మూడు నిమిషాల వీడియోను అప్లోడ్ చేయాలి. అందులో మూడు రకాల యోగా ప్రక్రియలుండాలి. క్రియ, ఆసన, ప్రాణాయామ, బంధ లేదా ముద్రలో ఏవేని మూడు ప్రక్రియలుండాలి. విజేతల్ని మొదట దేశాలవారీగా ఎంపిక చేసి, ఆ తర్వాత అంతర్జాతీయంగా నిర్ణయిస్తారు.