Saturday, May 4, 2024

అటవీ నిర్వహణ, పచ్చదనం పెంపు బాగు

- Advertisement -
- Advertisement -

కంపా నిధుల వినియోగంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం
అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు భేష్
క్షేత్రస్థాయి పర్యటించిన కంపా సిఈఓ, రాష్ట్రాల పిసిసిఎఫ్‌లు

Improve forest management and greenery

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను నిబంధనల మేరకు వినియోగిస్తూ తెలంగాణ అటవీ శాఖ మంచి ఫలితాలను సాధిస్తోందని జాతీయ కంపా సిఈఒ సుభాష్ చంద్ర ప్రశంసించారు. జాతీయ సదస్సులో భాగంగా తెలంగాణకు వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన అటవీ సంరక్షణ ప్రధాన అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో ఆయన పాల్గొన్నారు. కండ్లకోయ అక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్, తదితర అంశాలను వారు పరిశీలించారు. అక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో సౌకర్యాలు చాలా బాగున్నాయని వారు ప్రశంసించారు. ప్రత్యామ్నాయ అటవీకరణ నిధుల వినియోగం బాగుందన్నారు.

అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ప్రయోజనంగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) సంజయ్ శ్రీ వాత్సవ మాట్లాడుతూ.. పెరిగిన పట్టణీకరణ నేపథ్యంలో ప్రజలకు అవసరమైన స్వచ్చమైన ఆక్సిజన్ అందించేందుకు అర్బన్ పార్కులు లంగ్ స్పేస్‌లుగా పనిచేస్తాయన్నారు. తెలంగాణ అటవీ శాఖ చొరవ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని వెల్లడించారు. మణిపూర్ పిసిసిఎఫ్ ఆదిత్యజోషి మాట్లాడుతూ తెలంగాణ అటవీశాఖ పనితీరు చాలా ఆదర్శవంతంగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందని అన్నారు. తమ రాష్ట్రంలో కూడా ఆక్సిజన్ పార్కు తరహాలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై పచ్చదనం పరిశీలన

హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై దాదాపు 70 కిలోమీటర్ల ఈ బృందం పర్యటించి పచ్చదనాన్ని పరిశీలించింది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సిస్టెమ్‌ను వివిధ రాష్ట్రాల పిసిసిఎఫ్‌లు అధ్యయనం చేశారు. ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద ఉన్న గ్రీనరీ నిర్వహణ, ఓఆర్‌ఆర్‌పై ఏర్పాటు చేసిన బొమ్మలను చూసి ముగ్దులయ్యారు. హెచ్‌ఎండిఏ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్, టేబుల్ క్యాలెండర్‌లను అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ వారికి అందజేశారు.

మరో నెలరోజుల్లో దాదాపు 160 కిలోమీటర్ల పొడవున ఓఆర్‌ఆర్ పై గ్రీనరీ నిర్వహణ కోసం డ్రిప్ సిస్టెమ్ అందుబాటులోకి వస్తుందని వారికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పిసిసిఎఫ్ (కంపా) లోకేష్‌జైస్వాల్, వివిధ రాష్ట్రాలకు చెందిన పిసిసిఎఫ్‌లు,హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజె. అక్బర్, అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అటవీ అధికారులు జోజి, జానకిరామ్, వెంకటేశ్వర్లు, శంషాబాద్ డివిజనల్ ఆఫీసర్ విజయానంద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News