Friday, May 3, 2024

ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలం: హర్భజన్ సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్లూటిసి ఫైనల్లో టీమిండియా ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైందని భారత మాజీ స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తొలుత బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లో భారత్ తేలిపోయిందన్నాడు. పెద్ద పెద్ద టోర్నీల్లో భారత్ తడపడుతుందనే విషయం మరోసారి రుజువైందన్నాడు. ఆస్ట్రేలియాపై ఆరంభంలో పైచేయి లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారన్నాడు. పేలవమైన ఫీల్డింగ్ దీనికి తోడు కావడంతో తొలి రోజు భారత్ భారీగా పరుగులు ఇచ్చుకుందన్నాడు. అయితే రెండో రోజు బౌలర్లు విజృంభించడంతో మళ్లీ ఆధిపత్యం చెలాయించే ఛాన్స్ భారత్‌కు దక్కిందన్నాడు. అయితే దీన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయిందన్నాడు. టాపార్డర్‌లోని నలుగురు తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో భారత్ మెరుగైన స్కోరును సాధించడంలో విఫలమైందన్నాడు.

ఒకవేళ ఓపెనర్లతో పాటు కోహ్లి, పుజారాల ఎవరో ఒకరూ నిలదొక్కుకుని ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. ఇక చాలా ఏళ్లుగా భారత్ ప్రధాన టోర్నీలలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పోతుందన్నాడు. కిందటిసారి కూడా డబ్లూటిసి ఫైనల్లో పేలవమైన ఆటతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైందన్నాడు. అంతేగాక టి20 వరల్డ్‌కప్‌లలో కూడా భారత్ అంతంత మాత్రంగానే రాణించిన విషయాన్ని హర్భజన్ గుర్తు చేశాడు. భవిష్యత్తులోనైనా ఆటగాళ్లు మెగా ఈవెంట్‌లలో ఆత్మవిశ్వాసంతో ఆడేలా వారిని తీర్చిదిద్దాలన్నాడు. ఈ బాధ్యత కోచ్‌లతో పాటు కెప్టెన్, సీనియర్ ఆటగాళ్లపై ఉంటుందన్నాడు. ఇక డబ్లూటిసి ఫైనల్లో మళ్లీ పుంజుకోవడం భారత్‌కు అంత తేలికేం కాదని హర్భజన్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News