చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతుతన్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను 134 పరుగులకే ఆలౌట్ చేసి.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 54/1తో రెండోరోజు ఆటను ముగించింది. ఇక మూడో రోజు ఆట ప్రారంభించి కొద్దిసేపటికే ఛతేశ్వర పుజారా(07), రోహిత్ శర్మ(26)లు ఒక పరుగు వ్యవధిలోనే ఔటయ్యారు. ఆ తర్వాత పంత్(08), రహానె(10), అక్షర పటేల్ (07), కుల్దీప్ యాదవ్ (03)లు వరుసగా పెవిలియన్ చేరారు. ఒక దశలో 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ(62), అశ్విన్(106) లు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించి ఆదుకున్నారు. దీంతో భారత్ 200 మార్క్ ను అందుకుంది.ఈ క్రమంలో వీరిద్దరూ అర్థ శతకాలను పూర్తిచేసుకున్నారు.
అయితే, కుదురుకున్నట్లే కనిపించిన కోహ్లీ ఔటవ్వడంతో టెయిలండర్ల సహాయంతో అశ్విన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న తన ధనా ధన్ బ్యాటింగ్ చెలరేగాడు. దీంతో అశ్విన్ తన కెరీర్ మరో అద్భుత శతకంతో అభిమానులను అలరించాడు. చివర్లో మహ్మద్ సిరాజ్(16 నాటౌట్) కూడా రెండు భారీ సిక్స్ లతో వావ్ అనిపించాడు. అయితే భారీ షాట్ కు యత్నించి అశ్విన్ ఔట్ కావడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ మొత్తం 85.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ కు 481 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ, జాక్ లీచ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా, ఒలీ స్టోన్ ఒక వికెట్ తీశాడు.
India all out 286 on day 3 against England