400 కిమీ దూరంలోని లక్ష్యఛేదన
న్యూఢిల్లీ: భూమి నుంచి భూమి పైని లక్ష్యాలను ఛేదించగల సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను భారత్ మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశించిన లక్ష్యాలను కచ్ఛితత్వంతో ఛేదించగల సామర్ధమున్న బ్రహ్మోస్ క్షిపణి పాటవ పరీక్షలను వరుసగా జరుపుతున్న భారత్ ఇందులో భాగంగానే ఈ పరీక్షలను విజయవంతంగా ప్రయోగించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో అండమాన్, నికోబార్ దీవులలో నేలపై నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగిందని వర్గాలు తెలిపాయి. కాగా..290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ క్షిపణిని ఉద్దేశించగా తాజాగా దీన్ని 400 కిలోమీటర్లకు విస్తరించి ప్రయోగించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే బ్రహ్మోస్ క్షిపణి వేగాన్ని మాత్రం 2.8 మాక్(ధ్వనికి మూడు రెట్ల వేగం)ను మాత్రం తగ్గించలేదని వారు చెప్పారు. త్వరలోనే ఆకాశం నుంచి, సముద్రం నుంచి ప్రయోగించగల సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలను వేర్వేరుగా భారత వైమానిక దళం, భారతీయ నౌకాదళం ప్రయోగిస్తాయని వర్గాలు తెలిపాయి. భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన బ్రహ్మోస్ ఏరోస్సేస్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణులను జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాలు లేదా నేలపైనుంచి ప్రయోగించవచ్చు.