మెగా మేనల్లుడు సాయి తేజ్, – ‘ప్రస్థానం’ ఫేమ్ దేవ కట్టా కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జె.బి. ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ “రిపబ్లిక్ సినిమాకు ఇన్స్పిరేషన్ నా అజ్ఞానం. మనం క్యాప్టలిజం, కమ్యూనిజం, సోషలిజం గురించి మాట్లాడుతుంటాం. అయితే వీటి గురించి మనకు ఎంత లోతుగా తెలుసు? అన్న ప్రశ్న వేసుకుంటే మనకు తెలియదు. నా వరకు వస్తే… నాకు తెలియదు. మనం ప్రకృతిలో ఓ భాగం, మనం ఎక్కడున్నామో దాని గురించి తెలుసుకోవాలి. చదువుకున్న వ్యక్తిగా సమాజం గురించి తెలియనప్పుడు ఓ సామాన్యుడికి ఏం అర్థమవుతుంది? అనుకొని ఈ కథను తయారుచేసుకున్నాం. సెన్సార్ సభ్యులకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. సింగిల్ కట్ లేకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక నా విజన్లోనే నన్ను ఈ సినిమా తీసేలా సాయితేజ్ నన్ను ప్రోత్సహించాడు. సైనికుడిలా నాకు అండగా నిలబడ్డాడు. ఐశ్వర్యా రాజేష్ ఎన్నారై పాత్రలో అద్భుతంగా నటించింది”అని అన్నారు.