Saturday, April 27, 2024

DC vs RR: నేడు రాజస్థాన్ తో పోరు.. ఢిల్లీ బోణి కొడుతుందా?

- Advertisement -
- Advertisement -

జైపూర్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే పోరుకు రాజస్థాన్ రాయల్స్ గురువారం సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీకి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈమ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఢిల్లీ కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో లక్నోను అలవోకగా ఓడించిన రాజస్థాన్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా కలిగిన శాంసన్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. ఐపిఎల్ శాంసన్‌కు చక్కటి రికార్డు ఉండడం కూడా రాజస్థాన్‌కు సానుకూలా పరిణామమే. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌ల రూపంలో విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్‌లో వీరిద్దరూ బాగానే ఆడినా భారీ స్కోర్లను సాధించడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో యశస్వి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పరుగుల వరద పారించాడు. ఐపిఎల్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు.

మరోవైపు ప్రపంచంలోని అత్యంత విధ్వంసక బ్యాటర్లలో ఒకరిగా పేరున్న బట్లర్, హెట్‌మెయిర్‌ల రూపంలో రాజస్థాన్‌కు పదునైన అస్త్రాలు ఉండనే ఉన్నాయి. బట్లర్, హెట్‌మెయిర్‌లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా రాజస్థాన్‌కు భారీ స్కోరు ఖాయం. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, అశ్విన్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో బట్లర్, హెట్‌మెయిర్ తప్ప మిగతా బ్యాటర్లు బాగానే ఆడారు. ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అంతేగాక ట్రెంట్ బౌల్ట్, చాహల్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు సమష్టిగా రాణించారు. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. దీంతో పాటు సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా రాజస్థాన్‌కు అతి పెద్ద ఊరటనిచ్చే అంశమే.

పంత్‌కు సవాల్..
మరోవైపు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్‌కు ఆశించిన శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓటమి పాలైంది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పంత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక పోయాడు. అయితే రాజస్థాన్‌పై మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జట్టును ముందుకు నడిపించాలనే లక్షంతో ఉన్నాడు. డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్‌ల రూపంలో విధ్వంసక బ్యాటర్లు ఢిల్లీలో ఉన్నారు.

అయితే ఆరంభ మ్యాచ్‌లో వీరు భారీ స్కోర్లు సాధించలేక పోయారు. కానీ రాజస్థాన్‌పై మాత్రం చెలరేగి ఆడాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. మార్ష్, వార్నర్, హోప్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే రాజస్థాన్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. పంత్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమయ్యాడు. ఇషాంత్ శర్మ, మార్ష్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఢిల్లీ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News