Saturday, April 27, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా, బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా నేత కూడా ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. సుందర్‌రాజ్ తెలిపారు. ఇటీవల ఇదే ప్రాంతంలో మావోలు ముగ్గురు స్థానికులను హతమార్చడంతో భద్రతా బలగాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. హతమైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా స్థలాన్ని ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా సిఆర్‌పిఎఫ్ అధికారులు పరిశీలించారు. కోబ్రా 210,205 సిఆర్‌పిఎఫ్ 229 బెటాలియన్, ఆర్‌జి జవాన్లు, భద్రతా దళాల ఈ బృందంలో ఉన్నారు.

బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలోని చీపుర్‌భట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య భారీ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో ముగ్గురు నక్సలైట్లు మరణించగా అంతకుముందు చోటేతుంగాలిలో కూడా నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇదిలా ఉండగా సరిహద్దు రాష్ట్రాలు, మన్యం ప్రాంతంలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ ఘటన చోటుచేసుకుంటుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. బాంబుల మోతలు, కాల్పుల శబ్ధాలు వినపడితే ఉలిక్కి పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News