Wednesday, May 1, 2024

రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ

- Advertisement -
- Advertisement -

Judicial inquiry into Raju's suicide

వరంగల్ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్‌కు బాధ్యత అప్పగింత
నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై శుక్రవారం నాడు హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు న్యాయస్థానం ఆదేశించింది. హత్యాచార కేసు నిందితుడు రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పౌర హక్కుల సంఘం నేత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ప్రతివాదనలు చేశారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ ఆత్మహత్యపై ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ చేసినట్లు ఎజి నివేదిక ఇచ్చారు. ఆ వీడియోలను శనివారం రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై గురువారం ఉదయం రాజు మృతిచెందిన విషయం తెలిసిందే.

అయితే పోలీస్ వర్గాలు మాత్రం రాజుది ఆత్మహత్య అని స్పష్టంగా చెబుతున్నారు. కానీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అయితే రాజు ఆత్మహత్యపై అతడి తల్లి, భార్య కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను పోలీసులే చంపారని, చంపి రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు భార్య మౌనిక ఆరోపించారు. రాజు దొరికాడని, అతణ్ని ఎన్‌కౌంటర్ చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పుకోవడం తాము విన్నామని మౌనిక తెలిపింది. “ఒక్కగానొక్క కొడుకు ఇలా పోయాడు. వాణ్ని పోలీసులే చంపి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. నేను, నా కోడలు, మనుమరాలు అనాథలమయ్యాం. ఆదివారమే దొరికాడన్నారు. మళ్లీ దొరకలేదన్నారు. బుధవారం రాత్రి మమ్మల్ని పంపించేటప్పుడు.. కోడలిని, మనుమరాలిని మంచిగా చూసుకోమని చెప్పారు. అప్పుడే మాకు అనుమానం కలిగింది” అని రాజు తల్లి ఈరమ్మ వాపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News