Saturday, April 27, 2024

తదుపరి సీజేఐగా జస్టిస్ యు.యు. లలిత్

- Advertisement -
- Advertisement -

Justice UU Lalit in line to become next CJI

న్యూఢిల్లీ : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు 49 వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ లేఖను కేంద్ర న్యాయశాఖ … ప్రధాన మంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ ఈనెల 26 న పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీం కోర్టు లోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయడం పరిపాటి. ఆ లెక్కన జస్టిస్ ఎన్‌వి రమణ తర్వాత యు.యు. లలిత్ అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27 న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే ముగుస్తుంది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన పదవీ విరమణ చేస్తారు.

జస్టిస్ లలిత్ ప్రస్థానమిది….
దేశం లోనే తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్ తలాక్ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ యు యు లలిత్ ఉన్నారు. 1957 నవంబరు 9 న జన్మించిన ఆయన జూన్ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీస్‌ను సుప్రీం కోర్టుకు మార్చారు. ఆగస్టు 13,2014 న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నాటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. కేరళ లోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వం లోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News