ఎసిబి వలలో కీసర తహసీల్దార్
28 ఎకరాల భూసెటిల్మెంట్కు రూ.2కోట్లు డిమాండ్
గతంలోనూ పట్టుబడ్డా మారని లంచగొండితనం
మనతెలంగాణ/హైదరాబాద్: కీసర మండంలోని రాంపల్లి గ్రామ శివారులోని ఓ భూ వ్యవహారంలో నగరంలోని ఎఎస్రావు నగర్లోని తన నివాసంలో శుక్రవారం రాత్రి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటూండగా కీసర తహసీల్దార్ నాగరాజును ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈక్రమంలో కీసర మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో 28 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో ఎంఆర్ఒ నాగరాజు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో రియాల్టర్లు రూ.1.10 కోట్లు ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకున్నారు. కాగా, ఎంఆర్ఒ లంచం డిమాండ్ చేసిన సమాచారాన్ని రియాల్టర్లు ఎసిబి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
దీంతో తన నివాసంలో లంచం తీసుకుంటున్న ఎంఆర్ఒతో పాటు మరో ఇద్దరు రెవెన్యూ అధికారులను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం కేసులో పట్టుబడిన ఎంఆర్ఒ నాగరాజు ఇంట్లోతో పాటు అతని సమీప బంధువుల ఇళ్లలో ఎసిబి బృందం శుక్రవారం అర్థరాత్రి వరకు సోదాలు చేపట్టారు. అయితే ఎసిబి పట్టుబడిన ఎంఆర్ఒ నాగరాజు గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఆ కేసులో ఎంఆర్ఒ నాగరాజుకు మూడు నెలల క్రితం కోర్టులో ఊరట లభించింది. కాగా శుక్రవారం అర్థరాత్రి వరకు ఎసిబి అధికారులు జరిపిన సోదాలలో ఎంఆర్ఒ నాగరాజుకు సంబంధించిన దాదాపు రూ. 9 కోట్ల మేరకు స్థిర చరాస్తులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Keesara MRO Trap in ACB Net