మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన తరువాత ప్రధాని నిర్ణయం తీసుకుంటారన్నారు. బుధవారం న్యూఢిల్లీలో కిషన్రెడ్డి మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాలు, నిపుణులు దీనికి సంబంధించిన సూచనలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో
నేపథ్యంలో దీనిని ఎదుర్కొనేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి? ప్రజలకు అవసరమైన ఇతర నిత్యవసర వస్తులవులను ఎలా అందించాలి? తదితర అంశాలపై పలు కోణాల్లో కసరత్తు చేస్తున్నామన్నారు. దేశంలో టెస్టింగ్ కిట్ల కొరతలేదన్నారు. కరోనా వైద్య పరీక్షల కోసం ఈ ఒక్క రోజే రెండు లక్షల కిట్లు వచ్చాయని తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొవడంలో ప్రతిపక్షాలు మంచి సూచనలు చేస్తే తప్పకుండా వాటిని స్వీకరిస్తామని కిషన్రెడ్డి తెలిపారు.
కరోనాను ఎదుర్కొనేందుకు సామాజిక దూరం పాటించడం ఒక్కటే పరిష్కార మార్గమన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్కు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. దయచేసి ఇళ్ళ నుంచి ఎవరూ బయటకు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు అని సూచించారు. వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను ఒకేసారి ప్రజలు తెచ్చుకోవాలన్నారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తోందని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ అవసరాలకోసం కాదన్నారు. విదేశాల నుండి వచ్చి ఢిల్లీ లో క్వారైంటైన్ పూర్తి చేసుకున్నవారిని ప్రస్తుత పరిస్థితులలో వారి స్వస్థలాలకు తరలించడం సాధ్యం కాదన్నారు. వారికి క్వారైంటైన్ సెంటర్లోనే లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ఆహారం , వసతి సదుపాయాలు అందిస్తామన్నారు. వారి తల్లితండ్రులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని సూచించారు. వారి క్షేమం పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దు అని కిషన్ రెడ్డి తెలిపారు.