Saturday, May 4, 2024

నలుమూలలా పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

KTR Review on Food Processing Zones

ప్రాజెక్టుల తర్వాత పరిశ్రమలే ప్రాధాన్యం
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో పారిశ్రామిక శకం
విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం బుధవారం టియస్‌ఐఐసి కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, సివిల్ సప్లైస్ వంటి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీ గా పెరిగాయన్నారు. దీంతో పాటు మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలయిన మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు మొదలుకొని రాష్ట్ర వ్యాప్తం గా అన్ని ప్రాంతాలు ప్రాజెక్టుల నీటితో కళకళలాడుతున్నయన్నారు.

ప్రధానంగా వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందన్నారు. పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన డిమాండ్‌ని మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలం టే భారీ ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయకుండా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా, పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించే అవకాశం కలుగుతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా పండుతున్న వరితో పాటు, తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఆయిల్ ఫామ్ వంటి నూతన పంటల భవిష్యత్ అవసరాలను కూడా ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటులో పరిగణలోకి తీసుకుంటామన్నారు.
పంటల తాలూకు ఫుడ్ మ్యాప్ సిద్ధం
రాష్ట్రంలో పండుతున్న పంటల తాలూకు ఫుడ్ మ్యాప్‌ను పరిశ్రమల శాఖ తయారు చేసిందని మంత్రి కెటిఆర్ వివరించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పండేందుకు అవకాశాలు ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న కసరత్తును అధికారులు మంత్రికి వివరించారు. ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కనిష్టంగా 225 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ జోన్లలో విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కామన్ అప్లుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు కూడా ఉంటాయన్నారు.
పంటల ఆదారంగా ప్రాసెసింగ్ యూనిట్లు
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పండుతున్న వరి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, వంట నూనెలు, పండ్లు-కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజ్, మార్కెటింగ్ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి ప్రభుత్వం పిలిచిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద సుమారు 350 దరఖాస్తులు అందాయన్నారు. అయితే ఈ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గడువును మరింతగా పెంచి మరిన్ని కంపెనీలను భాగస్వాములను చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి స్థానిక రైతాంగం నుంచి ఇప్పటికే పలు డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు అవసరమైన భూసేకరణ వంటి అంశాల్లో స్థానిక శాసనసభ్యులు ప్రత్యేకంగా చొరవ చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వ్యవసాయ రంగానికి అద్భుతమైన అండ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అద్భుతమైన అండ లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక ప్రగతి మరింతగా ముందుకు పోవాలంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఈ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపాదిత స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో రాష్ట్ర రైతాంగం యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు పెరుగుతాయన్నారు. వారి ఉత్పత్తులకు దీర్ఘకాలంలో లాభసాటి ధరలు లభిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం తయారుచేసే ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ఈ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు.

మిల్లింగ్ రంగానికి ప్రొత్సాహం ఇచ్చేలా నూతన పాలసీని రూపొందించాలి
సిఎం కెసిఆర్ సంకల్పంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగిందని, అందుకనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెంచడం కోసం ఈ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల కాలంలోనే ఎఫ్‌సిఐకు అందించడంలో ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి మిల్లింగ్ ఇండస్ట్రీకు ప్రోత్సాహం ఇచ్చేలా నూతన పాలసీ రూపొందించాలని ఆయన కోరారు. పారా బాయిల్డ్, స్టీమ్ మిల్లులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని అందుకనుగుణంగా ఈ జోన్లలో ఏర్పాట్లు చేయాలన్నారు. మిల్లింగ్ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.

KTR Review on Food Processing Zones

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News