Saturday, April 27, 2024

కర్ఫ్యూను ఉల్లంఘించిన శ్రీలంక విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

 

SriLanka curfew

వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగిస్తున్న పోలీసులు

కొలంబో: శ్రీలంక సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. సుస్థిరతను అందిస్తానంటూ 2019లో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు రాజపక్షకు వ్యతిరేకంగా రాజకీయ వాతావరణం మారుతోంది. శ్రీలంకలో దిగజారిన ఆర్థిక సంక్షోభంకు నిరసనగా ప్రభుత్వం విధించిన వారాంతపు కర్ఫ్యూను కాండీలో వందలాది మంది విద్యార్థులు ఉల్లంఘించారు. ఆ దేశం విద్యుత్ కోతలు, ఆహారం, ఇంధనం, నిత్యావసరాల కొరతను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను ధిక్కరించిన నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లు, భాష్పవాయువులు ప్రయోగించారు. కొలంబోలో విపక్ష నాయకుల ప్రదర్శనలో వందలాది మంది చేరారు. అయితే వారిని ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస ఇంటి వద్ద పోలీసులు, సైనికులు ఆపేశారు. ఇదిలావుండగా శ్రీలంకలో సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి వాటిని శనివారం నుంచి బ్లాక్ చేశారు. అక్కడి రక్షణ మంత్రిత్వశాఖ ప్రత్యేక సూచనల ద్వారా తాత్కాలికంగా వాటిని బ్లాక్ చేసేసింది. దేశ ప్రయోజనాల దృష్టానే వాటిపై నిషేధం విధించినట్లు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జయంత డి సిల్వా చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. శ్రీలంకలో కర్ఫ్యూను శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విధించారు. కర్ఫూను ఉల్లంఘించిన దాదాపు 664 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. పబ్లిక్ ఆర్డర్‌ను పరిరక్షించడానికే దేశంలో ఎమర్జెన్సీని విధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స సమర్థించుకున్నారు. సుస్థిరతను అందిస్తానని అధికారంలోకి వచ్చిన రాజపక్స నేడు దేశంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు. శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంత ఆర్థిక సంక్షోభం ఎన్నడూ నెలకొనలేదు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించమని శ్రీలంక- అంతర్జాతీయ ద్రవ్య నిధిని, రుణాలివ్వమని భారత్‌ను, చైనాను కోరుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News