Friday, April 26, 2024

పట్టణప్రగతి కోసం మారుదాం.. మారుద్దాం

- Advertisement -
- Advertisement -

ktr

 

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి/ నాగర్ కర్నూల్ ప్రతినిధి : మనం మారుదాం-… మన పట్టణాన్ని మారుద్దాం… అనే నినాదంతో ప్రజా ప్రతినిధులు, అధికారులూ ప్రజల ముందుకు వెళ్లాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు సూచించారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రతి పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా బహిరంగా మల, ముత్ర విసర్జన ఉండకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డులలో పారిశుద్య ప్రణాళికలు తయారు చేసుకోవాలని తద్వారా పట్టణ పారిశుధ్య ప్రణాళిక మేరకు అభివృద్దిపథంలో ముందుకు తీసుకెళ్ళాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాభివృద్ది, పచ్చదనం, పరిశుభ్రత విషయాల్లో పౌరుల భాగస్వామ్యం మరింతగా పెంచాలని, పట్టణాభివృద్దిలో స్వీయబాధ్యత ఉండాలని సూచించారు. నూతన మున్సిపల్ చట్టం ద్వారా ప్రతి మున్సిపాలిటీలలో 10 శాతం బడ్జెట్ ను కేవలం హరితహరం కోసం ఖర్చు చేసేలా నిబంధనలు రూపొందించామని చెప్పారు. నాటిన మొక్కలలో 85 శాతం మొక్కలు బతికించుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా మిషిన్ భగీరథ నీళ్ళకు మించిన స్వచ్చమైన నీరు లేదని, ప్రజలంతా భగీరథ నీళ్ళనే త్రాగాలని సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా పట్టణాలలో 75 గజాల లోపు స్థలంలో ప్రజలు ఏలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించుకునేలా నిబంధనలు రూపొందించినట్టు తెలిపారు. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలలో లంచాల మాట వినడానికి కూడా తావివ్వమని చెప్పారు. ప్రవేటు సెక్టార్‌లో టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు స్థాపించి లక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని వివరించారు.

దేవరకొండ పట్టణంలో కోతుల, పందుల బెడద విపరీతంగా ఉన్నందున వాటి నియంత్రణకు ఒక కార్యాచరణను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవరకొండలో 6 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డ్‌ను నిర్మించబోతున్నామన్నారు. ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను వేరుచేసిమున్సిపాలిటీ ఆటోలలో వేయ్యాలని, తడి చెత్తనుంచి ఎరువును తయారు చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీల్లో అక్రమంగా పుట్టుకొచ్చిన లే ఔట్ల తాటా తీద్దామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా లే ఔట్లు ఏర్పాటు వల్ల మున్సిపాలిటీల ఆదాయానికి భారీగా గండి పడుతుందన్నారు. అక్రమ లే ఔట్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ, పార్కుస్థలాలు, లే ఔట్లలోని పార్కులను ఖబ్జాలకు గురైతే స్వాధీనం చేసుకోవాలని, నిర్మాణాలు చేపడితే కూల్చివేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు.

ప్రభుత్వం సెల్ఫ్‌అసెస్మెంట్ ద్వారా పౌరులకు సౌకర్యాలు కల్పించిందని, రాష్ట్ర వ్యాప్తంగా రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. పుట్టుక నుంచి చావు దాకా ప్రభుత్వమే చేస్తుందని కనీసం పారిశుధ్యాన్ని ప్రజలు పాటించాలని సూచించారు. ఇతర దేశాలను చూసి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ లాభపేక్షాలు లేకుండా ప్రజల కోసం అభివృద్ధి జరగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జడ్పీచైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, దేవరకొండ శాసనసభ్యుడు రవీందర్‌కుమార్, ఎంపి పోతుగంటి రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కర్నె ప్రభాకర్, తేరా చిన్నపరెడ్డి, మాజీ ఎంపి మంధ జగన్నాథం, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, కలెక్టర్‌లు శ్రీధర్, ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ మను చౌదరి,మున్సిపల్ కమీషనర్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

Let us change for the sake of Pattana Pragathi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News