Saturday, April 27, 2024

టార్గెట్ 17 పెట్టుకొని లోకసభ ఎన్నికల్లో పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారికి సముచిత స్థానం
12కు తగ్గకుండా లోకసభ స్థానాలు గెలిపించుకోవాలి
20 తర్వాత క్షేత్రస్థాయి పర్యటన
పార్టీ శ్రేణులకు సిఎం పిలుపు
లోకసభకు రాష్ట్రం నుండి సోనియా పోటీ చేయాలని తీర్మానం
టిపిసిసి విస్తృతస్థాయి సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : లోకసభ ఎన్నికల్లో 17 లోకసభ స్థానాలను టార్గెట్ గా పెట్టుకుని ్ల పనిచేయాలని టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలని ఆయనన్నారు. బుధవారం టిపిసిసి విస్తృతస్థాయి సమావేశం, ఇందిరా భవన్‌లో టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడి ్డగారి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నూతనంగా నియమితులైన ఎఐసిసి రాష్ట్ర ఇంచార్జి దీపా దాస్ మున్షీ, ఎఐసిసి కార్యదర్శులు, మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీల సభ్యులు, డిసిసి అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మూడు తీర్మానాలు ప్రతిపాదించారు.

ఎఐసిసి తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీకి అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానం, తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రేను అభినందిస్తూ రెండవ తీర్మానం, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ మూడవ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఓటమి చవిచూసినా బిఆరెస్ కు బుద్ది రాలేదని, నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

బిఆరెస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఆయన విమర్శాస్త్రాలు ఎక్కుపెట్టారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరుతున్న కిషన్ రెడ్డి ఆనాడు స్వయంగా నేను సిబిఐ విచారణ కోరినపుడు ఏం చేశారని సిఎం ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేసి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

బిజెపి, బిఆర్‌ఎస్ ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారన్నారు. ఎఐసిసి ఇంచార్జి దీపాదాస్ మున్శీ మాట్లాడుతూ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారని అన్నారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలను నేరవేర్చామని, సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలంగాణ ఇస్తూ నిర్ణయం తీస్కున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఈసారి మరింత శ్రమించాలని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని, నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ లో మరింత టీమ్ వర్క్ ఉండాలన్నారు. మనకు ముందు చాల ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు తో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతోందని, ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తాం భట్టి

కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్ద కాలం తర్వాత మనకు ఇదో గొప్ప అవకాశమని, అనేక కష్ట నష్టాలను భరించి అధికారంలోకి వచ్చామని చెప్పారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని, ప్రజలు విశ్వాసం తో మనల్ని గెలిపించారని భట్టి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని ఆరోపించారు. ఒకవైపు ఆర్థికంగా బలోపేతం కావాలి, మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫాక్ట్ వచ్చింది, స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారు. అని భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఎంతో శ్రమించారని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందన్నారు. మరి కొన్ని నెలలు కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయన్నారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో బిఆర్ ఎస్ మరింత బలహీనంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టంతోనే ప్రభుత్వం లోకి వచ్చాము, వారి కష్టాలలో మేము పాలు పంచుకొంటూ మీకు సహకారాన్ని అందిస్తామని ఉత్తమ్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా ఒక్క కుటుంబంగా పని చేద్దామన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి హోదాలో కార్యవర్గ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో 3 తీర్మానాలు ప్రవేశపెట్టామన్నారు. క్రియశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ప్రభుత్వం లో ఇచ్చే పదవుల పై ఎఐసిసి కర్యాదర్శులు జాబితా తయారు చేస్తున్నారన్నారు. సీనియర ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ ఎన్నికల్లో పని చేసిన నేతలను గుర్తించి స్థాయిలను బట్టి వారికి ప్రభుత్వం లో చైర్మెన్‌లు ,డైరెక్టర్ పదవులు ఇవ్వడానికి ఎఐసిసి ఇంచార్జ్ , సెక్రెటరీలు జాబితా తయారు చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే వారికి పదవులు వస్తాయన్నారు.

14న సిఎం దావోస్ పర్యటన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 14న దావోస్ పర్యటనకు వెళ్ళనున్నారు. రాష్ట్రంలో పెట్టబడుల కోసం వారు నాలుగు రోజులు అక్కడే ఉంటారు. కాగా ప్రజల నుండి వచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలని టిపిసిసి కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8,9 తేదీల్లొ ఉమ్మడి జిలా ్ల నేతలతో పార్లమెంట్ ఎన్నికల పై మాట్లాడనున్నారు. 11,12,13 తేదీల్లొ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు ,నేతలు తో ఎన్నికల పై మాట్లాడనున్నారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష లు ఉంటాయి. ఈ సమావేశం నెల రోజుల్లొ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందించింది. 6 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఉచిత బస్ ప్రయాణం చేశారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News