ములుగు : జాతరలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలిసి మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం వన దేవతలను దర్శించుకుని ఎత్తుబంగారం సమర్పించుకున్నారు. తదనంతరం అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు చాలా ప్రాముఖ్యత ఉందని ఇలాంటి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతర సమయంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.
రహదారులగుండా బారీ కేటింగ్ ఏర్పాటులో పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి చోట సైన్ బోర్డులు, సలహాలు సూచనలు ఇచ్చి అధికారులు ఒక టీంగా పనిచేసి జాతరను జయప్రదం చేయాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులను దగ్గర ఉండి దర్శనం చేపించి క్షేమంగా ఇంటికి పంపించే వరకు అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈసందర్బంగా ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆధ్వర్యంలో అధికారుల రాకకు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో లాండ్ ఆర్డర్ అడిషనల్ డిజిపి జితేందర్, ఐజిలు నాగిరెడ్డి, ప్రమోద్ కుమార్, వరంగల్ సిపి విశ్వనాథ్ రవిందర్, మహబూబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ములుగు, ఏటూరునాగారం ఎఎస్పీలు సాయి చైతన్య, శరత్ చంద్ర పవర్, ఓఎస్డీ సురేష్ లు, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.