Thursday, May 16, 2024

శవాల మధ్య మృత్యువుతో పోరాటం..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: మృత్యుంజయుడంటే నిజంగా రోబిన్ నైయానే. ఒడిశాలోని బాలసోర్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ఘటనలో పట్టాలపై చలనం లేకుండా పడి ఉండడంతో అందరూ అతను చనిపోయాడనే అనుకున్నారు. సహాయక చర్యలు నిర్వహించే వారు సైతం అతనిని చనిపోయినట్లుగానే భావించి ప్రమాదం జరిగిన చోటుకు దగ్గర్లోనే ఉన్న ఓ స్కూలగదిలో మిగతా శవాల మధ్య ఉంచేశారు. అతను శవాల మధ్య అనేక గంటల పాటు బతికి ఉండి నరక యాతన అనుభవిస్తూ ఉండి పోయాడు. కాగా అక్కడ గుట్టలుగా పేరుకు పోయిన శవాలను తొలగించడానికి సహాయక సిబ్బంది స్కూలు గదిలోకి వెళ్లారు. ఒక వర్కర్ శవాల గుట్ట మధ్యనుంచి నడుస్తూ ఉండగా ఓ చెయ్యి సడన్‌గా అతని కాలు పట్టుకునింది. లోగొంతుకలో ‘ నేను బతికే ఉన్నా. చనిపోలేదు. దయచేసి తాగడానికి నీళ్లివ్వండి’ అని అడగడం వినిపించింది.

మొట్టమొదట ఆ వర్కర్ దయ్యమేమోననుకొని భయంతో బిక్కచచ్చిపోయాడు. ఆ తర్వాత ధైర్యం కూడగట్టుకొని తన కాలు పట్టుకున్న 35 ఏళ్ల రోబిన్ వైపుచూశాడు. అప్పటికి ఇంకా ప్రాణాలతో ఉన్న అతను తనను కాపాడాలంటూ వేడుకోవడం కనిపించింది. వెంటనే సహాయక సిబ్బంది అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా చర్నేఖాళి గ్రామానికి చెందిన రోబిన్ నైయా ప్రమాదంలో తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు కానీ, ప్రాణాలతో బైటపడ్డాడు. ఆ గ్రామానికి చెందిన మరో ఏడుగురితో కలిసి రోబిన్ పని కోసం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో హౌరానుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళుతున్నారు. ప్రస్తుతం విషమస్థితిలో ఉన్న రోబిన్ మిడ్నపూర్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News