హైదరాబాద్: నకిలీ ఫేస్బుక్ ఖాతాతో మహిళలు, యువతులను వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నల్గొండ జిల్లా తేరాట్పల్లికి చెందిన వరకాల రమేష్ జర్నలిజం పూర్తి చేశాడు. నగరంలోని హయత్నగర్లో ఉంటూ కొద్ది రోజులు ఓ న్యూస్ ఛానల్లో సబ్ ఎడిటర్గా పనిచేశాడు. తర్వాత ప్రవర్తన బాగాలేదని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఫేస్బుక్లో పద్మావతిపద్మావతి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. వాటి ద్వారా తను మహిళగా నమ్మిస్తూ పలువురు యువతులు, మహిళలకు రిక్వెస్ట్ పంపించాడు. వాటిని అంగీకరించిన వారి ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించేవాడు. ఈ క్రమంలోనే బాధితురాలు రమేష్తో ఛాటింగ్ చేసింది.
వాటి ఆధారంగా ఆమె వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, చిరునామా తదితరాలను సేకరించారు. ఫోన్ నంబర్ తెలుసుకుని మాట్లాడాడు, తన నగ్న చిత్రాలు పంపించాలని డిమాండ్ చేశాడు. తను యువతి కాదని, యువకుడని తెలుసుకుని బాధితురాలు తన నంబర్ను బ్లాక్ చేసింది. దీంతో కోపం పెంచుకున్న నిందితుడు ఆమెతో చేసిన ఛాటింగ్, మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. తనను అన్బ్లాక్ చేయాలని, ఛాటింగ్ చేయాలని కోరడంతో ఛాటింగ్ చేసింది. ఐదు రోజుల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. ఆ సమయంలో బాధితురాలి ఫోన్ను తీసుకుని వాట్సాప్, ఫేస్బుక్లో ఉన్న ఫొటోలు బలవంతంగా తీసుకున్నాడు. వాటిని ఆమె స్నేహితులకు పంపించాడు. ఆమె క్యారెక్టర్ను దిగజార్చేలా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్ పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ ప్రకాష్ దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నాడు.