Thursday, May 9, 2024

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తోనే మణిపూర్ అభివృద్ధి : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Manipur development with double engine govt: PM Modi

ఇంఫాల్ : మణిపూర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తప్పనిసరి అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో మణిపూర్ అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పునాదులు వేసిందని చెప్పారు. మణిపూర్ లోని హైన్‌గాంగ్ నియోజక వర్గంలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ రాష్ట్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని చెప్పారు. మణిపూర్ ఏర్పడి 50 ఏళ్లయిందని, కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో అసమానత్వాన్నే రాష్ట్రం చవి చూసిందని విమర్శించారు. బీజేపీ అసాధ్యాలను సుసాధ్యం చేసిందని, మణిపూర్ లోని ఏ ప్రాంతం లోనూ ఇప్పుడు బంద్‌లు, దిగ్బంధాలు లేవని అన్నారు.

ప్రభుత్వంలో చురుకైన భాగస్వామ్యం కోసం, ప్రభుత్వ నిర్ణయాలలో పాలుపంచుకునేందుకు యువత, ఫస్ట్‌టైమ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్‌సింగ్ అందరినీ కలుపుకుని వెళ్తూ రాష్ట్రాన్ని మార్పు దిశగా పరుగులు తీయిస్తున్నారని ప్రశంసించారు. కొవిడ్ సమయం లోనూ మణిపూర్‌లో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించినట్టు చెప్పారు. మణిపూర్ లోని ప్రతి పదిమందిలో ఏడుగురు ఉచిత రేషన్ లబ్ధి పొందుతున్నారని చెప్పారు. మణిపూర్ మహిళలు విదేశీ శక్తులపై చారిత్రక పోరాటం సాగించారని ప్రశంసించారు. ఎన్డీయే ప్రభుత్వాలు మాత్రమే మహిళల సమస్యలను అర్ధం చేసుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పనిచేయగలవని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News