హైదరాబాద్: వరంగల్ జిల్లా కొడకండ్లలో మినీ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్లో చేనేత శాఖపై మంత్రి కెటిఆర్ సమీక్షలు జరిపారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి మేరకు సిఎం కెసిఆర్ ఆదేశంతో కొడకండ్లలో మినీ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. కొడకండ్లలో నైపుణ్యం కలిగిన వేలాది మంది నేతన్నలు ఉన్నారని, చాలా మందికి సరైన ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లారని, టిఆర్ఎస్ ప్రభుత్వం టెక్స్టైల్స్ రంగానికి మద్దతు ఇస్తుండడంతో అనేక మంది తెలంగాణకు తిరిగి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. పవర్ లూమ్ కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల తయారీని కొనసాగిస్తామని, కరోనా సంక్షోభ కాలంలో నేతన్నలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించామని, కాంట్రిబ్యూషన్ని ఒకేసారి వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుతో 25 వేల మంది నేతన్నలకు రూ.95 కోట్లు అందాయన్నారు. టెక్స్టైల్స్, చేనేత రంగాలకు బడ్జెట్లో కేటాయింపులపై నివేదిక తయారు చేయాలన్నారు.
20 వేల నేతన్నలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కొండకండ్లలో మినీ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మంత్రి కెటిఆర్కు ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.