హైదరాబాద్: బిజెపి,కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని టిఆర్ఎస్ ఆరోపించింది. దుబ్బాక,నిజమాబాద్, కరీంనగర్ ఎన్నికల్లో బిజెపి,కాంగ్రెస్ కుట్రబయటపడిందని రాష్ట్ర విద్యుత్శాఖమంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపి,కాంగ్రెస్లను ప్రజలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీలతో పొత్తుపెట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 స్థానాల్లో టిఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఆయన తెలిపారు. కేంద్రంలో మోడీ బిజెపి పాలన నికృష్టపు పాలనని ఆయన దుయ్యబట్టారు. రాజ్యాంగబద్దమైన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ను ఏకవచనంతో దూషించడం విపక్షాల విజ్ఞతకే వదిలివేస్తుందన్నారు.
అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ను దేశ ద్రోహి అంటూ సంబోధించడం పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. బిజెపి వరదల్లో బురద రాజకీయం చేస్తుందని నిందించారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వరదసహాయంపై ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని ఆయన సవాల్ చేశారు. చిట్ల పురాణంతో ఓట్లరాలవన్నారు. కాంగ్రెస్, బిజెపి చీకటి ఒప్పందాలతో సరిహద్దురాష్ట్రాల్లో రాష్ట్రం ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తే బిజెపి ఆద్రోహంలో పాలు పంచు కుంటుందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నుండి ఏడు మండలాలను ఆంధ్రలో కలిపింది బిజెపి కాదాని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ సంక్షేమం లో తెలంగాణలో ఉంటే కనీసం తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించకుండా సీలేరు విద్యుత్ ప్రాజ్టెను ఆంధ్రలో మోడీ ప్రభుత్వం కలిపిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్షం చేసింది కాంగ్రెస్ బిజెపి అని ఆయన దుయ్యబట్టారు.
హైదరాబాద్ అభివృద్ధిపై చ్చకు సిద్ధం
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషిచేసిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన బిజెపి,కాంగ్రెస్కు సవాల్ విసిరారు. చర్చకు వచ్చే దమ్ము,ధైర్యం బిజెపికి ఉందాని ఆయన నిలదీశారు. వరదలో బురద రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బిజెపి, కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందన్నారు. కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, రైతు బీమా పథకాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అంకురాఆర్పణ చేశారని ఆయన చెప్పారు. కనీవిని ఎరగని రీతిలో వర్షాలు కురిస్తే విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగ కుండా ప్రభుత్వం చేసిందని ఆయన గుర్తు చేశారు.
2014 ముందు మంచినీటి సమస్య, విద్యుత్ సంక్షోబాలతో ప్రజానీకం పడ్డ అవస్థలను ప్రజలు ఇప్పటికి గుర్తుంచుకున్నారని ఆయన చెప్పారు. కిందటి ఎన్నికల్లో అభివృద్ధిని కోరుకున్న ప్రజలు, నీటి కష్టాల నుంచి, కరెంట్ కష్టాల నుంచి బయటపడ్డ ప్రజలు టిఆర్ఎస్కు పట్టం కట్టారని చెప్పారు. బిజెపి,కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు టిఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈసమావేశంలో ఎంఎల్సి శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్తో కలిసి మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడారు.