Saturday, April 27, 2024

ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానమేంటి?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ తన విదానాన్ని బహిర్గతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే గతించి పోతున్న ఆ పార్టీకీ ఊపిరి పోసిన రాజస్థాన్, శ్వాస నందించిన చత్తీస్‌గఢ్, సంజీవినీని అందించి ప్రాణం పోసిన కర్ణాటక రాష్ట్రాలలో ఎందుకు 24 గంటలు ఉచితంగా సరఫరా చేయడం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు రాష్ట్రానికో విధానం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. శనివారం బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉచిత విద్యుత్‌కు పేటెంట్‌గా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ విధానాన్ని అమలు పరిచారని చెప్పుకుంటున్న వైఎస్‌గానీ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అని ఏనాడు ఉచ్చరించలేదన్నారు.

అలా ఉచ్చరించి ఉంటే ఆ రికార్డ్‌లు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. తెలిసో తెలియక ఆ పార్టీ అధినేత మూడు నుండి ఎనిమిది గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరిపోతుందంటే, అందుకు అనుగుణంగా ఆయన వెంట ఆ పార్టీ నేతలు అదే రాగాన్ని ఆలపిస్తున్నారని, ఆ చూస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానంగా కనిపిస్తుందని చెప్పారు. అనువైన సమయంలో రైతాంగం వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందుబాటులో ఉంచితే దానిని చూసి ఆ పార్టీ నేతలు సహించుకోలేక పోతున్నారని విమర్శించారు. పొరపాటున ఆ పార్టీకీ అక్కడక్కడా ఓటేస్తే ఎకరం ఉన్న రైతులకు గంట, రెండు ఎకరాలు ఉన్న రైతుకు రెండు గంటలు, మూడు ఎకరాలు ఉన్న రైతుకు మూడు గంటలు గరిష్టంగా 8 గంటలు సరఫరా చెయ్యడం ఆ పార్టీ విధానంగా రూపొందించుకున్నట్లు మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల నోటి వెంట జారుతున్న మాటలు రుజువు చేస్తున్నాయని చెప్పారు.

ఇంటికి 24 గంటలు సరఫరా ఉండాలి,వాణిజ్య,వ్యాపారాలకు 24 గంటలు సరఫరా ఉండాలి,పరిశ్రమలకు 24 గంటలు ఉండాలి…వ్యవసాయదారులకు మాత్రం 8 గంటలు చాలు అన్నది కాంగ్రెస్ పార్టీ వైఖరిగా తేటతెల్లం అవుతుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులందరికి 24 గంటలు సరఫరా చేస్తున్నట్లే రైతాంగానికి 24 గంటలు సరఫరా చెయ్యాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పం అని మంత్రి స్పష్టం చేశారు. చీటికీ మాటికి గల్లీ నుండి ఢిల్లీ వరకు పేటెంట్ పేటెంట్ అంటూ చిలక పలుకులు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వారి పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లో వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చెయ్యకపోగా అమ్ముకుంటున్నారని తెలిపారు. అటువంటి మోసాన్ని ఎండగట్టకపోతే తెలంగాణా రైతాంగానికి మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు.

అవినీతికి కాంగ్రెస్ నాయకులు పేటెంట్‌దారులు
గల్లీ నుండి ఢిల్లీ వరకు అధికారాన్ని అనుభవించి జైలులో ఊ చలు లెక్కపెట్టిన వారు అవినీతికి మాత్రమే పేటెంట్‌దారులని మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఏమి చేశాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారని విరుచుకుపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు.. కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడమే ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు. తెలంగాణా ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ మీద చర్చకు తెర లేపిందని పేర్కొన్నారు. గృహ వినియోగదారుల నుండి మొదలు వర్తక వ్యాపార,వాణిజ్య ,పరిశ్రమలకు సరఫరా 24 గంటల విద్యుత్‌పై ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి కాం గ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇందు లో దాగి ఉన్న మర్మం కనిపెట్టాలని తెలంగాణా రైతాంగాన్ని కోరారు. కేవలం వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్‌పై చర్చ పెడుతున్నారు అంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్రకు తెరలేపిందన్న అనుమానం కలుగుతోందని చెప్పారు.

అవాకులు చెవాకులు పేలుతున్న ఈ ప్రబుద్ధుల పాలనలోనే కదా సబ్ స్టేషన్‌ల ముట్టడిలు, ధర్నాలు,రాస్తారోకోలు,ఆందోళనలు జరిగిందని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారి రైతాంగం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంటే వారిలో అలజడి లేపేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ చర్చకు తెర లేపినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఖరి బహిర్గతం అయిందని, అటువంటి దుర్మార్గాన్ని ఎండ గట్టేందుకు తెలంగాణా రైతాంగం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ రైతు సంఘంతో పాటు అన్ని పార్టీల రైతు సంఘలా ప్రతినిధులు రైతువేదికల మీద,రచ్చబండల కాడ వ్యవసాయానికి మూడు గంటల నుండి ఎనిమిది గంటలు సరఫరా చాలు అన్న కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటనపై చర్చించాలని మంత్రి జగదీష్ రెడ్డి రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News