Monday, May 6, 2024

దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా కిషన్‌రెడ్డికి తలసాని కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బిఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అవసరం లేదు, సికింద్రా బాద్‌కైనా ఏం తెచ్చారో చెప్పాలని తలసాని చురకలంటించారు. కనిపించినప్పుడల్లా కిషన్ రెడ్డి రాజకీయాలే మాట్లాడతారా? అని మంత్రి ప్రశ్నిం చారు. ఫాంహౌస్ ఫైల్స్ ఫెయిల్ అంటున్నారని, దర్యాప్తు సంస్థలపై మీకున్న చిన్నచూపు అర్ధమవుతోందని తలసాని దుయ్య బట్టారు. కిషన్ రెడ్డి విమర్శల్లో కాకుండా, అభివృద్ధిపై పోటీ పడాలని హితవు పలికారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో బిజెపికి సంబంధం లేదంటూనే, ఇంకో వైపు వాళ్లే కోర్టుకు వెళ్లారని తలసాని ఎద్దేవా చేశారు.

మరోవైపు సంబరాలు చేసుకుంటున్నారని, సంబరాలు చేసుకోవడానికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా? అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. సిఎం కెసిఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దొరికిన ఆడియో, వీడియోలు అబద్ధమా? అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో బిజెపి నేతలు నార్కొ అనాలిసిస్, లైడిటెక్టర్‌కు సిద్ధమా అని వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సవాల్ విసిరారు, దాని సిద్ధమా కిషన్‌రెడ్డి చెప్పాలన్నారు. బిజెపి ఇంత దిగజారుడు రాజకీయం ఎప్పుడూ చేయలేదన్నారు. కిషన్‌రెడ్డిని గెలిపించి తప్పు చేశామని సికింద్రాబాద్ ఓటర్లు అనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. .తెలంగాణ లో అధికారంలోకి వస్తామన్నట్టుగా బిజెపి నేతలు మాట్లాడుతున్నా రన్నారు.

ఎవరు అధికారం లోకి వస్తారో తమకు తెలుసునన్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సిబిఐ విచారణను స్వాగతిస్తూ కిషన్ రెడ్డి మాట్లాడుతుండటం తమకు అనుమానాలు కలిగిస్తోందన్నారు. భాద్యత లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. కేంద్రంలో బిజెపికి అధికారం శాశ్వతం కాదని ఆ పార్టీ నేతలు గ్రహించాలన్నారు. అభివృద్ధిని సూచించే అన్ని అంశాలు రాష్ట్రప్రభుత్వ గొప్ప తనాన్ని ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు. కేంద్రానికి అలాంటివి ఏమీ లేవని, బీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే అది వారి ఖర్మ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మీడియా సమావేశంలో మంత్రి తలసానితో పాటు ఎంఎల్‌ఎలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News