Monday, April 29, 2024

గృహలక్ష్మిలో మంత్రుల జోక్యం తగదు

- Advertisement -
- Advertisement -

లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్:  గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వకుండా మంత్రుల జోక్యం తగదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో మంత్రులు,ఎమ్మెల్యేల రాజకీయ జోక్యంతో అర్హులైన పేదలకు న్యాయం జరుగదన్నారు. దరఖాస్తులు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉన్నప్పుడు,ఇండ్లు మంజూరు చేసే అధికారం మంత్రులకు వద్దని సూచించారు. తక్షణమే గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఇండ్లులేని పేదలకు రూ.18 వేల కోట్లతో 2.72 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చిన సిఎం కెసిఆర్ వాగ్దానం అమలు చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎన్నో వివరాలు ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.6 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.3 లక్షలు కేటాయించడమంటే ప్రజలను మరింత అప్పులపాలు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహలక్ష్మికి రూ.10 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గృహలక్ష్మి దరఖాస్తుకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడాన్ని మినహించాలని తొమ్మిది ఏళ్లుగా కొత్తరేషన్ కార్డులు ఎందుకు జారీ చేయలేదని ఈకాలంలో లక్షల మంది కొత్తగా పెళ్లి చేసుకుని నూతన కుటుంబ వ్యవస్థగా ఏర్పడ్డారని అన్నారు. వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా గృహలక్ష్మి పథకంకు దరఖాస్తు చేసుకోవాలంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలని నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు లేవన్నారు. ప్రభుత్వ,అసైన్డ్,వక్ఫ్ భూములను పేదలకు ఇళ్లకు పంచాలని గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాను అన్ని గ్రామపంచాయతీ,మునిసిపల్ కార్యాలయాల్లో అతికించాలని పేర్కొన్నారు.

సర్వాయి పాపన్న ఆశయసాధన కోసం గతేడాది ఆయన జన్మస్థలం ఖిల్లాషాపూర్ లో బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించినట్లు తెలుపారు. బీఎస్పీ అన్ని వర్గాలను కలుపుకును ముందుకువెళ్తుందని,వచ్చే ఎన్నికల్లో బీసీలకు 70 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని అన్నారు. దమ్ముంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 70 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేష్,కంబలె గౌతం,సెక్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,షాకీర్, శోభన్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News