Saturday, September 21, 2024

ఆక్రమణలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

నెల రోజుల్లోగా తొలగింపు, రాజీలేదు

వరంగల్‌లో నాలాల ఆక్రమణే ముంచింది, ఇక శాశ్వత పరిష్కారం
మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ. 25 కోట్లు
సిఎం కెసిఆర్ సూచనల మేరకు త్వరలో బృహత్‌ప్రణాళిక ప్రకటన
మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఓరుగల్లులో మంత్రుల బృందం పర్యటన
వరద తాకిడికి గురైన బాధితులకు పరామర్శ, సమస్యలపై ఆరా
కిలోమీటర్ల మేర ముపునకు గురైన కాలనీలు, వరదనీటిలోనే నడక

మన తెలంగాణ/హైదరాబాద్/ వరంగల్ బ్యూరో: వరంగల్ నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ప్రకటించారు. వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. జరిగిన నష్టంపై అధికారులు పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం వరంగల్ నగరంలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ముంపుకు గురైన పలు ప్రాంతాలను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. అనంతరం నిట్‌లో అధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్ష చేశారు.
నగరంలో పర్యటించిన సందర్భంలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారన్నారు. నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని పలువురు బాధితులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. వారి చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమన్నారు.
నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమణలున్నాయని… వాటిని తక్షణం తొలగించాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో రాజీ పడేది లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ వత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద నిర్మాణాలు తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని సంబంధిత అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పనులను వెంటనే ప్రారంభం కావాలన్నారు. ఇంకా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులున్నాయా అనే విషయం పరిశీలించాలన్నారు. నాలాలపై ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే పని చేయడానికి కలెక్టర్ చైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని వెల్లడించారు. వీరిద్దరిలో ఒకరు ప్రతి వారంలో ఒక రోజు వరంగల్లో పర్యటిస్తారన్నారు. నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవి అక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొలగించాలన్నారు. పేదల ఇండ్లయితే వారికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలన్నారు. రిజిస్ట్రేషన్ ఉన్న వారివైతే నష్ట పరిహారం చెల్లించి ఇళ్లను తొలగించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తూనే…. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా వాటికి ప్రహారీ గోడలు(రిటైనింగ్ వాల్స్) నిర్మించాలని సూచించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ ఆక్విడక్ట్ వద్ద కూడా పూడిక తీయాలని సంబంధిత అధికారులకు మంత్రి కెటిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నగరం ఎటు పడితే అటు, ఎట్ల పడితే అట్ల ఉండొద్దు
వరంగల్ నగరంలో నాలాలాపై ఆక్రమణలు ఇప్పుడు వచ్చినవి కాదని, చాలా ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్న తంతు అని మంత్రి కెటిఆర్ అన్నారు. గతంలో ఇండ్ల నిర్మాణం, లే అవుట్లు, రోడ్ల నిర్మాణం ఓ పద్దతి ప్రకారం జరగలేదన్నారు. ఇకపై అలా జరగదని, అన్నీ పక్కాగా జరుగుతాయన్నారు. పద్దతి ప్రకారం నగరాభివృద్ది జరగాలనే ఉద్దేశ్యంతోనే కొత్త మున్సిపల్ చట్టం తెచ్చామని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.
దానికి తోడు వరంగల్ నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమయిందన్నారు. ముఖ్యమంత్రి ఆమోదంతో త్వరలోనే దాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ రెండింటితో పాటు కొత్తగా టిఎస్ బి..పాస్ కూడా వచ్చిందన్నారు. ఈ చట్టాలు, విధానాలు, ప్రణాళికలకు అనుగుణంగా వరంగల్ లో ఇకపై నిర్మాణాలుండాలన్నారు. నగరం ఎటు పడితే అటు, ఎట్ల పడితే అట్ల అన్నట్లు కాకుండా ఓ పద్ధతి ప్రకారం అభివృద్ది కావాలన్నారు. అలాగే ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు జరగాలని మంత్రి కెటిఆర్ వివరించారు.

సిఎంకు ప్రత్యేక శ్రద్ధ
వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉన్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. వరంగల్ లో భారీ వర్షాలు, వరదలు అనే సమాచారం సిఎంకు ఎంతో ఆందోళన కలిగించిందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ దెబ్బతినకూడదని ఆయన భావించారన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. ఏమాత్రం ప్రాణనష్టం కలగకుండా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సిఎం మార్గ నిర్దేశం చేశారన్నారు. సిఎం ఆదేశాల మేరకు వరంగల్ నగరంలో 20 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాలకు చెందిన 4,500 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బోట్లు, పరికరాలతో సహా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను పంపామన్నారు. వారంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం (సోమవారం) స్వయంగా వరంగల్‌కు రావాలనుకున్నారన్నారు. కానీ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశ్యంతో మానుకున్నారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడకు పంపించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇక్కడి పరిస్థితిని చూసి, సిఎంకు సమగ్రంగా నివేదించామన్నారు. తక్షణ అవసరాల కోసం రూ.25 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి… అధికారుల నుంచి పూర్తి స్థాయి అంచనాలు రూపొందించిన తర్వాత ఎన్ని నిధులు కావాలన్నాఇస్తామని చెప్పారన్నారు. కాబట్టి అధికారులు జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని కెటిఆర్ పేర్కొన్నారు.

నగర జనాభా ఇంకా పెరిగే అవకాశం
వరంగల్ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలకు చేరుకుందని, భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలన్నారు. పారిశుద్ధ పనుల్లో యాంత్రీకరణ జరగాలన్నారు. స్వీపింగ్ మిషన్ల ద్వారా నగరంలో పరిశుభ్రతను కాపాడాలని కెటిఆర్ కోరారు. ప్రస్తుతం కురిసిన వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపుకు గురైన వారికి అవసరమైన సాయం అందించడం తక్షణ కర్తవ్యంగా అధికారులు భావించాలని సూచించారు. ముంపుకు గురైన వారికి ప్రభుత్వం పక్షానే నిత్యావసర సరుకులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగవదు…్ద. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించడంతో పాటు నిర్మాణంలో ఉన్న భవనాల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
వరంగల్ నగరంలో నాలాలపై ఆక్రమణలు తొలగించే కార్యక్రమం నిర్వహించడానికి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్ గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్ గా, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్‌ఇ, వరంగల్ అర్బన్ ఆర్డీవో, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్‌ఇ సభ్యులుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీనీ నియమిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

గాంధీ తరహాలో ఎంజిఎం ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం
కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి తరహాలోనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజిఎం సందర్భించిన అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ ఎంజిఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామని ఈటల ప్రకటించారు. అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మోబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్లు ఈటల ప్రకటించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి, వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ పై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. ఎంజిఎంలో ప్రత్యేక వార్డు పెట్టామని, అలాగే కెఎంసిలో మరో వార్డు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంత మంది రోగులొచ్చినా హైదరాబాద్ కానీ, ప్రైవేటు ఆసుపత్రులకు కానీ పోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. మిగతా వారిలో కూడా ఎక్కువ శాతం మంది కోలుకుంటున్నారని తెలిపారు. మరణాల సంఖ్య ఒకశాతం లోపే ఉందని. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండడమే అసలు మందు అని అన్నారు. వైరస్ సోకిన వారు ఆసుపత్రిలో ఉన్నా, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా వైద్యులు ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితిని పరిశీలి స్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. అవరసమైన మందులు, సూచనలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. బంధువులు ముందుకు రాకపోతే ప్రభుత్వ పరంగానే ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎవరైనా కోవిడ్ వల్ల చనిపోతే, వారి బంధువులు రాకుంటే ప్రభుత్వ పరంగానే అంత్యక్రియలు కూడా చేస్తున్నామని ఈటల వెల్లడించారు.
సీజనల్ అంటు వ్యాధులపై దృష్టి పెట్టాలి
కరోనా విషయంలో శ్రద్ధ పెడుతూనే సీజనల్, అంటు వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి ఈటల సూచించారు. వానలు, వరదలు వచ్చినందున జ్వరాలు, ఇతర రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్య పనులు నిర్వహించాలన్నారు. పరిశుభ్ర వాతావరణం వల్ల చాలా వరకు అంటు రోగాలను, సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. కరోనా పేషంట్లకు తోడుగా వారి అటెండెంట్లను వార్డుల్లోకి ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించవద్దు అని మంత్రి ఈటల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. కరోనా పేషంట్లను కలిపి ఉంచవద్దన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైనన్ని పిపిఇ కిట్లు ఉన్నాయన్నారు. వాటిని ఉపయోగించుకోవాలన్నారు. వైద్యుల ఆరోగ్యం, భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని, ఆసుపత్రుల్లో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ…విసర్జన మరింత మెరుగ్గా జరగాలని ఈటల సూచించారు.

Ministers KTR and Etela Visit Warangal to review Floods

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News