Sunday, April 28, 2024

ఎల్‌ఐసీ సొమ్ముతో ఆటలా: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అదానీ కుంభకోణం కారణంగా ఎల్‌ఐసీలోని ప్రజల డబ్బులు ఆవిరైపోతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ 11% మేర పడిపోవడం పట్ల ఆమె శనివారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏమిటని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ సర్కారు ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇంత భారీ కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయినా సిబిఐ, ఈడీ, ఆర్‌బిఐ వంటి సంస్థ లు ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.

రాజ్యాంగబద్ధ సంస్థలంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా? అని విమర్శించారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం కన్నులు తెరిచి దేశ ప్రజలకు మరింత నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుని, జెపిసి  వేయాలని డిమాండ్‌ చేశారు. నాడు బ్రిటిష్‌ ప్రభుత్వం డివైడ్‌ అండ్‌ రూల్‌ పద్ధతిని పాటిస్తే.. నేడు కేంద్రంలోని బిజెపి రైడ్‌ అండ్‌ రూల్‌ పద్ధతిలో దేశాన్ని పాలిస్తున్నదని నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి పార్టీ మీద దాడులు చేయడం, పార్టీని విడగొట్టి దొడ్డిదారిలో పాలించడమే ప్రస్తుత విధానమని విమర్శించారు.

రెండు సార్లు అధికారమిచ్చినా ప్రజలకు బిజెపి చేసిందేమీ లేదని, వ్యవసాయ నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైందని ఎమ్మెల్సీ  కవిత ధ్వజమెత్తారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి అన్నిం టా విఫలమైన బిజెపి ఈసారి ఓడిపోవాల్సిందేనని అన్నారు. ముంబైలో ఓ ప్రముఖ ఛానల్‌ ‘ఐడియోస్‌ ఆఫ్‌ ఇండియా సమ్మిట్‌ 2023’ పేరిట  శనివారం నిర్వహించిన సదస్సుకు కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘2024 ఎన్నికలు-విపక్షాల వ్యూహం’ అనే అంశంపై సాగిన చర్చలో పాల్గొని, మాట్లాడారు. మహారాష్ట్ర అభివృద్ధిలో బిఆర్‌ఎస్‌ పార్టీ భాగస్వామి అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముంబైలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి శనివారం నివాళి అర్పించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News