Saturday, April 27, 2024

కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

వరంగల్ : రాష్ట్రంలో కులగణన చేపట్టి బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్ ఎంలెసి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. వరంగల్‌లో బిసి హక్కుల సాధన కోసం భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బిసి డిక్లరేషన్‌లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.బిహార్‌లో కులగణన చేసినా కోర్టుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని, అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24 వేల మంది బిసిలు ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్‌సిటిసిలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ రీత్యా పరిపాలనలో బిసి భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే జనగణన ప్రక్రియను ప్రారంభించాలని పునరుద్ఘాటించారు. అలాగే, బిసిల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-=25 బడ్జెట్ లో ప్రభుత్వం ఆ నిధులను కేటాయించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం బిసి సబ్ ప్లాన్‌కి చట్టబద్ధత కల్పించాలని, ఎంబిసిల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకునే సౌలభ్యం కల్పించాలని, తద్వారా జనాభా ఆధారంగా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు చేసుకోవచ్చని తెలంగాణ తొలి సిఎం కెసిఆర్ ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. నిరంతరం సుప్రీం తీర్పును చూపించి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడంలేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్లలో ఒబిసి మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.2018 నుంచి ఇప్పటివరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు ఉన్నారని తెలిపారు. ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్‌సిలు 5 శాతం, ఎస్‌టిలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బిసి మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.

హక్కుల కోసం పోరాటం చేయాలంటే… తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యమాలకు పెట్టింది పేరైన వరంగల్ తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉందని గుర్తు చేశారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి బతుకమ్మకు రాష్ట్ర హోదా, నిరాహార దీక్ష చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం సాధించామని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 20 వేల మంది యువతకు ఉద్యగ కల్పనకు దారిచూపామని, దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చకు ప్రేరేపించామని వివరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంఎల్‌సి బస్వరాజ్ సారయ్య, పార్టీ నాయకులు వి. ప్రకాశ్, సుందర్ రాజు యాదవ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, భారత జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News