Thursday, May 9, 2024

మోడీ ప్రసంగమంతా అబద్దాలతో సాగింది

- Advertisement -
- Advertisement -
వరంగల్‌కు వచ్చి గురువింద గింజ సామెత మాట్లాడటం హాస్యాస్పదం : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై. సతీష్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ సభలో ఆయన ప్రసంగం ఆద్యంతం అవాస్తవాలు, వక్ర భాష్యాలు తప్ప మరేమి లేదని ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం అబద్దమేనని ఎద్దేవా చేశారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వకుండా వివక్ష చూపుతున్న మోడీ ఆ వీరవనితల పేర్లతో ప్రసంగాన్ని ప్రారంభించడం వారిని అవమానించడమేనన్నారు.

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును తొమ్మిదేళ్లుగా నాన్చుతున్న మోడీ గిరిజన బిడ్డల సంక్షేమం కోసం ఏదో చేశామని వారి జీవితాలను పూర్తిగా మార్చేశామని గాలి మాటలు మాట్లాడిపోయారని మండిపడ్డారు. గిరిజన బిడ్డల సంక్షేమానికి గురుకులాలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం వారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోందని, బడుగులను, దళితులను,గిరిజనులను కడుపులో పెట్టుకొని చూసుకుంటోందన్నారు. కానీ దళితులు గిరిజనులు ఆదివాసీలను తొమ్మిదేళ్లుగా మోసగిస్తున్న బిజెపి ఎస్టీ రిజర్వేషన్లు పక్కన పెట్టి గిరిజన బిడ్డలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏమి తెలియనట్టు మోడీ వరంగల్ కు వచ్చి గురివింద గింజ సామెత లాగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోడీ సర్కారు 9 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది వీసమెత్తు కూడా లేదని, వరంగల్ సభలో భారీ ప్రగల్భాలు పలికారు. తెలంగాణ సర్కారు ఏమీ చేయకపోతే తెలంగాణ పల్లెలకు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఎలా ఇస్తుందో చెప్పాలని నిలదీశారు. అంతర్జాతీయ అవార్డులు ఎలా వస్తున్నాయో కూడా మోడీ చెప్పాలని, తెలంగాణలో అన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తే మరి మిగతా బిజెపి ఫలిత రాష్ట్రాల్లో ఆ స్థాయి అభివృద్ధి ముందు కనిపించడం లేదో మోడీ ప్రజలకు వివరిస్తే బాగుంటుందన్నారు.

విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ మోడీ సొంత రాష్ట్ర మైన గుజరాత్‌కు తీసుకెళ్లి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చుకొని రూ. 521 కోట్లతో తెలంగాణలో వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రకటించి దాన్ని కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. దీన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్న కిషన్ రెడ్డి, ఇతర నాయకులు సమర్ధించుకోవడం వారికి రాష్ట్రంపై ప్రేమ ఎంత ఉందో, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడం పైన ఎంత పట్టింపు ఉందో స్పష్టం చేస్తోందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూలిపోయిన పురాతన భవనాల్లో, వందలాది మంది విద్యార్థులకు ఒకరిద్దరు టీచర్లతో నడుస్తున్న స్కూల్స్ గురించి మోడీకి తెలియదని ప్రశ్నించారు. తెలంగాణలో కార్పొరేట్ స్కూళ్లకంటే అద్భుతంగా భవనాలు నిర్మించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో గత 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చి ఓట్లు వేయించుకునే పన్నాగం తప్ప మోడీ మాటల్లో ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని, ప్రపంచమంతా కూడా ఇక్కడ అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుందన్నారు. మీరు వచ్చి నాలుగు అబద్ధాలు చెప్పినంత మాత్రాన 9 ఏళ్ల అభివృద్ధి కనబడకుండా పోదని, ఇకనైనా విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులిస్తే బాగుంటుందని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News