Sunday, May 12, 2024

18న ఎన్‌డిఎ వ్యూహాత్మక కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ నెల 18న దేశ రాజధానిలోని అశోకా హోటల్‌లో బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీల సమావేశం జరగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపధ్యంలో జరిగే ఈ భేటీ సందర్భంగా బిజెపి తన కూటమి బలాన్ని చాటుకునేందుకు భారీస్థాయిలో యత్నిస్తుందని వెల్లడైంది. కర్నాటకలో ఎన్నికల ఫలితాలు , ఈ మధ్యకాలంలో కీలక భాగస్వామ్యపక్షాలు కొన్ని కూటమికి దూరం కావడంతో తిరిగి కొన్ని పార్టీలను కూటమిలోకి చేర్చుకునే దిశలో ఎన్‌డిఎ సమావేశం జరుగుతుందని వెల్లడైంది. ఇప్పటివరకూ ఎన్‌డిఎలో లేని కొన్ని పార్టీలకు, ఇంతకు ముందు ఉండి వైదొలిగిన పార్టీల ముఖ్యనేతలకు కూడా ఎన్‌డిఎ భేటీకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారు. ఇప్పటివరకూ ఏ కూటమిలో చేరని కొన్ని పార్టీలకు కూడా పిలుపు అందుతోంది.

శిరోమణి అకాలీదళ్, జెడిఎస్, టిడిపి, లోక్‌జన్‌శక్తి (పాశ్వాన్) పార్టీలకు కూడా పిలుపులు వెళ్లినట్లు వెల్లడైంది. ఈ నెల 18వ తేదీలోగానే కేంద్ర మంత్రి మండలిలో మార్పులు చేర్పులు, పార్టీ రాష్ట్ర శాఖలలో , జాతీయ స్థాయిలో కొన్ని మార్పులు చేపట్టిన తరువాతనే ఎన్‌డిఎ భేటీ ఉంటుందని వెల్లడైంది. కొత్తగా ఎన్‌డిఎలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యే కొన్ని శక్తివంతమైన పార్టీల నేతలకు కూడా కేంద్ర మంత్రి మండలిలో స్థానం కల్పించే దిశలో పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అదును చూసుకుని పార్లమెంట్ సెషన్ ముందే ఎన్‌డిఎ కీలక భేటీకి కసరత్తు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News