అమెరికాలో 24 గంటల్లో 2,751 మంది మృతి
ఒక్క రోజులోనే వెలుగు
చూసిన 40 వేల కేసులు
8 లక్షలకు పైగా రోగులతో అతలాకుతలమవుతున్న అగ్రదేశం
ఆగస్టు నాటికి 66వేల మరణాలు చోటు చేసుకుంటాయని అంచనా
వాషింగ్టన్: అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి మంగళవారం ఏకంగా2751 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 45,373కు చేరుకుంది. ఇక సోమవారం సాయంత్రంనుంచి మంగళవారం సాయంత్రం వరకు అంటే 24 గంటల్లో దాదాపు 40 వేల కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 8,27,093కి చేరింది. గత వారం రోజులుగా తగ్గుమ్ఖుం పడుతున్నట్లుగా కనిపించిన మరణాల సంఖ్య మంగళవారం ఒక్కసారిగా పెరిగిపోవడం ప్రభుత్వ ఆధికారులతో పాటుగా నిపుణులను సైతం ఆవదోణకు గురి చేస్తోంది. దీంతో ఆగస్టు నాటికి అమెరికాలో మరణాలు ఇంతకు ముందు అంచనా వేసిన దానికన్నా 5,561పెరిగి 66 వేల స్థాయికి చేరుకోవచ్చని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్, ఎవాల్యుయేషన్ (ఐహెచ్ ఎంఇ) అంచనా వేసింది.
దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఈ సంస్థ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ వస్తోంది. వైట్హౌస్ సైతం ఈ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటుంది. దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఎక్కుగా ఉన్న సమయంలో అంటే గత నెల ఈ సంస్థ ఈ వైరస్ కారణంగా ఆగస్టు నాటికి 90 వేల మంది చనిపోతారని అంచనా వేసింది. అయితే ఆ తర్వాత ఈ అంచనాను ఏప్రిల్ 7 నాటికి 82,000కు, తర్వాత కొద్ది రోజులకే మరో 20,000 తగ్గించింది. దేశంలోని చాలా రాష్ట్రాలు సామాజిక దూరానికి సంబంధించిన అన్ని నిబంధనలను చేరుగ్గా అమలు చేస్తున్నాయన్న అంచనాతో ఆ సంస్థ మరణాల సంఖ్యను తగ్గించింది. అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాలు నిబంధనలను సడలించే యోచనలో ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆ సంస్థ అంటోంది.